కేంద్ర సాయం తెలంగాణ రైతులకు అందదా?.. రైతుబంధులో దాన్ని కలిపేస్తారా?
హైదరాబాద్ : కేంద్రం తాజాగా ప్రకటించిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన తెలంగాణ రైతులకు అందనట్లేనా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తున్న రైతుబంధు పథకంలో కేంద్ర సాయం కలిపేస్తారా? ఇలాంటి అనుమానాలకు తాజా పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. కేంద్ర పథకం అమలు విధివిధానాలపై ఉన్నతస్థాయి అధికారులు సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఓకే చెబితే.. రైతుబంధు - పీఎంకేఎస్ఎన్వై గా పేరు మార్చేందుకు సిద్ధం కానుంది స్టేట్ సర్కార్.

అట్లొద్దు.. ఇట్లా చేద్దాం..!
తెలంగాణలో రైతుబంధు పథకం కింద ఖరీఫ్, రబీ పంటలకు రెండు విడతలుగా రైతులకు ఆర్థికసాయం అందుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా 5 ఎకరాలలోపు రైతులకు ఏటా 6వేల రూపాలయ ఆర్థికసాయం ఇస్తామని ప్రకటించింది. అయితే తెలంగాణలో ఇప్పటికే రైతుబంధు అమలవుతున్న సందర్భంలో.. కేంద్రం డైరెక్టుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఆ వాటాను రైతుబంధులో కలిపితే బాగుంటుందనే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

డైరెక్ట్గా వద్దు.. రైతుబంధుకు ఇవ్వండి..!
5 ఎకరాల లోపు లబ్ధిదారులకు కేంద్రం ఇవ్వనున్న మొత్తం.. రాష్ట్ర ఖజానాకు జమ చేస్తే బాగుంటుందనేది తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయంగా కనిపిస్తోంది. రైతులకు అందించే మొత్తాలకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించేందుకు సిద్ధమన్నట్లుగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. ఒకవేళ కేంద్రం ఓకే అంటే రైతుబంధు - పీఎంకేఎస్ఎన్వై గా పథకం పేరు మార్చడానికి కూడా రెడీ అనే సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం.
గత ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి రైతులకు 10 వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అందులో 90 శాతం మేర సన్న, చిన్నకారు రైతులకు పెట్టుబడి సాయం అందింది. ఈ నేపథ్యంలో 5 ఎకరాల లోపు రైతులకు కేంద్రం ఇస్తానంటున్న ఆర్థిక సాయం స్టేట్ సర్కార్ ఖజానాకు చేరితే.. 2,800 కోట్లకు పైగా కలిసొస్తుందనేది ప్రభుత్వ అంతరంగంగా కనిపిస్తోంది.

కేంద్రం ఒప్పుకుంటుందా?
కేంద్ర సాయం రాష్ట్ర ఖజానాకు జమ చేయాలనే విషయంలో మోడీ ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో మరి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా రాష్ట్రానికి రానుండటంతో ఆశలు చిగురించాయి. కేంద్ర పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషితో ఆమె భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో రైతుబంధు పథకం అమలుతీరుపై కేంద్ర మంత్రి చర్చించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రైతులకు కేంద్రం ఇచ్చే సాయం.. రైతుబంధు పథకంలో కలిపితే బాగుంటుందనే ప్రతిపాదన ఆమె దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. అదలావుంటే రానున్న
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం.. పీఎం కిసాన్ తెరపైకి తెచ్చిందనే వాదనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఒప్పుకుంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకమే.












Click it and Unblock the Notifications