వృద్ధురాలిపై పిచ్చికుక్క దాడి, పరిస్ధితి విషమం
మెదక్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పక్షవాతంతో ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ సంఘటనలో పిచ్చికుక్క దారణంగా వృద్ధురాలిని తినేసింది. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ మండలంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే... గుండ్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంపంగి నర్సమ్మ (65) పక్షవాతంతో మంచం పట్టింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను వరండాలో పడుకోబెట్టారు. వరండాలో నిద్రిస్తున్న నర్సమ్మ కళ్లు, చెవి, చెంపను పిచ్చి కుక్క తినేసింది. చావుబతుకుల మధ్య ఉన్న వృద్ధురాలిని సమీప ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలి పరిస్ధితి ప్రస్తుతం విషమంగా ఉంది.
కుక్కల నోట్లో తల
ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో కుక్కలు ఓ యువకుడి తలతో కనిపించడంతో ఆదివారం రాత్రి స్థానికంగా కలకలం రేగింది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ వ్యక్తి గాంధీనగర్ మీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా కుక్కలు ఓ యువకుడి తలను నోట కరుచుకుని వస్తుండగా చూసి స్థానికులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న సీఐ బాలరాజు, ఎస్ఐ సురేశ్ చేరుకుని ఆ చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కోసం జాగిలాలతో గాలించారు. అవి బుగ్గ అటవీ ప్రాంతం వైపు పరుగెత్తినా ఆచూకీ దొరకలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.