జడ్ కేటగిరీ భద్రత వద్దు, వారిపై యూఏపీఏ కింద ఎందుకు ప్రయోగించలేదు: అసదుద్దీన్ ఒవైసీ
న్యూఢిల్లీ: దాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తనకు కేటాయించిన జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ తిరస్కరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీరఠ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీ వెళ్తుండగా.. ఆయన కారుపై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

జడ్ కేటగిరీ వద్దు.. ఏ కేటగిరీగానే.. : అసదుద్దీన్ ఒవైసీ
ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీకి తక్షణమే సీఆర్పీఎఫ్ బలగాలతో జడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం శుక్రవారం నిర్ణయించింది. అయితే, తనకు జడ్ కేటగిరీ భద్రత అక్కర్లేదని, అందరిలాగే తాను ఏ కేటగిరీ పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు. అంతేగాక, తన కారుపై కాల్పుల ఘటనను లోక్సభలో ఆయన ప్రస్తావించారు.

చావు భయడనంటూ అసదుద్దీన్ ఒవైసీ..
ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ.. తాను చావుకు భయపడబోనని అన్నారు. తనకు జడ్ కేటగిరీ భద్రత అవసరం లేదనీ, దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. కాల్పులు జరిపిన వారి చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్ ద్వారా సమాధానం చెబుతారన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
నిందితులపై యూఏపీఏ ఎందుకు ప్రయోగించలేదు..: ఒవైసీ
తనపై కాల్పులు జరిపిన వారిపై యూఏపీఏ చట్టం ఎందుకు ప్రయోగించరని ప్రశ్నించారు అసదుద్దీన్ ఒవైసీ. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. తనకు న్యాయం చేయాలని కోరారు. ఇటీవల పంజాబ్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం అంశంపైనా తాను బలంగా ప్రశ్నించినట్లు తెలిపారు.
పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం
అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై దాడి నేపథ్యంలో పాతబస్తీలో హై అలెర్ట్ కొనసాగుతోంది. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్-ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై జరిపిన కాల్పుల నేపథ్యంలో పాతబస్తీ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత రాత్రి నుంచి పాతబస్తీలో ఎంఐఎం నేతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాడిని ఖండిస్తూ శుక్రవారం ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు.కాగా, తనను లక్ష్యంగా చేసుకొని సాగించిన కాల్పుల ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఎన్నికల సంఘానికి(ఈసీ) ఒవైసీ విజ్ఞప్తి చేశారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి వద్ద నుంచి పిస్తోల్ స్వాధీనం చేసుకున్నామని ఉత్తరప్రదేశ్ అదనపు డీజీపీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications