డ్రగ్స్ కేసు: నిన్న కెల్విన్.. నేడు సంగీత.. సిట్ విచారణతో ప్రకంపనలు
హైదరాబాద్లో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. చాపకింద నీరులా సాగుతోన్న ఈ దందా భయపెడుతోంది. మొన్నటికి మొన్న కెల్విన్తో బయటకు వచ్చిన లింకులకు తోడు.. ఇప్పుడు సంగీత కస్టడీతో బట్టబయలైన బాగోతం వణుకు పుట్ట
హైదరాబాద్: డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. హైదరాబాద్ లో చాపకింద నీరులా సాగుతోన్న ఈ దందా భయపెడుతోంది. మొన్నటికి మొన్న కెల్విన్తో బయటకు వచ్చిన లింకులకు తోడు.. ఇప్పుడు సంగీత కస్టడీతో బట్టబయలైన బాగోతం వణుకు పుట్టిస్తోంది. ఇప్పటికే రహస్యంగా ఆరుగురిని విచారించిన పోలీసులకు.. మరో 300 మంది డేటా దొరికింది.
కెల్విన్.. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా మీడియాను ఫాలో అవుతున్న వాళ్లు ఠక్కున గుర్తుపట్టే పేరు. ఈవెంట్ మేనేజర్ అయిన కెల్విన్ తీగలాగితే.. స్కూలు పిల్లలు, సినీ రంగానికి చెందిన డొంకలు బయటపడ్డాయి.
చూపులకు అమాయకంగా.. కానీ..
విజయవాడకు చెందిన సంగీతను చూస్తే అమాయకంగానే కనిపిస్తోంది. కానీ.. ఈమె కూడా కెల్విన్కన్నా తక్కువేమీ తినలేదు. కాదు.. కాదు.. కెల్విన్ కన్నా డ్రగ్స్ దందాలో తక్కువేమీ కాదు. జూలై రెండో తేదీన డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ సంగీతను మొదట్లో పోలీసులు అంత సీరియస్గా తీసుకోలేదు. ఎవరో నైజీరియన్ తెచ్చిస్తే అలా తెలిసిన వాళ్లకు సరఫరా చేసిందేమో అనుకున్నారు. కానీ.. సంగీతను కస్టడీలోకి తీసుకొని విచారించాక కాస్త ఆలస్యంగా పోలీసులకు అర్థమైంది. సంగీత ఏ స్థాయిలో డ్రగ్స్ రాకెట్ నడుపుతోందో..? నైజీరియన్లతో ఎలా లింకులు సంపాదించిందో..? ఎంత మంది వ్యాపారులు వినియోగదారులయ్యారో..?
చాపకింద నీరులా నగరం మొత్తం...
హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు ప్రధాన స్థావరంగా మారిందన్న వాదనల నేపథ్యంలో బయటపడుతున్న లింకులు పోలీసులనే భయపెడుతున్నాయి. బయటకు కనిపించకుండా చాపకింద నీరులా నగరం మొత్తం డ్రగ్స్ బిజినెస్ వ్యాపించిందన్న వాస్తవం మాత్రం తెలిసిపోయింది. కెల్విన్ విచారణతో విద్యార్థులు, టాలీవుడ్ లింకులు బయటపడ్డాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ వ్యవహారంలో అత్యంత చురుగ్గా పనిచేశారు. ఇప్పుడు సంగీత విచారణతో నైజీరియన్లతో డ్రగ్స్ బిజినెస్ లింకులు, వ్యాపారవేత్తలు, ఐటీ ప్రముఖుల సంబంధాలు బట్టబయలయ్యాయి. పోలీసులు ఈ దందా ఆనవాళ్లను బయటకు తీశారు. దీంతో.. ఇన్నాళ్లుగా సాగిన విచారణ మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు బడా వ్యాపార వేత్తలు, ఐటీ నిపుణుల వైపు తిరిగింది.
సంగీత అండ్ టీమ్ సామాన్యమైనది కాదు...
ఎల్బినగర్లోని సితార హోటల్ వద్ద గంజాయి సరఫరా చేస్తూ సంగీతతో పాటు.. జాన్ ఒకోరియే అనే నైజీరియన్ కూడా పోలీసులకు చిక్కారు. అప్పుడు వాళ్ల దగ్గర మూడు ప్యాకెట్ల కొకైన్, రెండు ప్యాకెట్ల గంజాయి, ఒక ల్యాప్టాప్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీళ్లు ఇచ్చిన సమాచారంతో మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. సంగీత అండ్ టీమ్ సామాన్యమైనది కాదని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఈ కేసులో అరెస్టయిన ఆరుగురిని కస్టడీకి ఇవ్వాలంటూ గతనెల 28వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో.. నలుగురిని కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. న్యాయస్థానం అనుమతితో ఈ కేసులో ప్రధాన నిందితురాలు సంగీతతో పాటు.. మరో ముగ్గురిని ఎల్బినగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారం రోజుల పాటు వారిని విచారించిన అనంతరం తిరిగి వారిని జైలుకు తరలించారు.
కీలక సమాచారం లభ్యం...
విచారణ సమయంలో సంగీత అండ్ బ్యాచ్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆరుగురికి నోటీసులు జారీచేసిన పోలీసులు.. మూడు రోజుల క్రితం వారందరినీ ప్రశ్నించారు. కొత్తగూడేనికి చెందిన అన్నారపు పవన్, జూబ్లీహిల్స్కి చెందిన సందీప్ రెడ్డి, అమరసింహ రెడ్డి, బంజారాహిల్స్కి చెందిన ఆకాష్, సోమూయల్ జాన్, మాదాపూర్కి చెందిన అర్జున్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. వీళ్లంతా వ్యాపారవేత్తలని పోలీసులు చెబుతున్నారు. తాము 3 నెలలుగా మత్తు పదార్థాలకి బానిసయ్యామని, కొకైన్తో పాటు.. గంజాయి తీసుకున్నామని వీరు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. విచారణకు హాజరైన వాళ్ల రక్తం, వెంట్రుకలు, గోర్ల నమూనాలు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య నిపుణుల ద్వారా తీసుకున్నారు.
300 మంది వ్యాపార వేత్తలతో సంబంధాలు?
అయితే.. విషయం ఇంతటితో ముగిసిపోలేదు. సంగీతతో పాటు.. పట్టుబడ్డ నైజీరియన్ల వద్ద లభించిన సెల్ఫోన్ల డేటా అత్యంత కీలకంగా మారింది. ఈ డేటా ఆధారంగా సుమారు 300 మంది వ్యాపార వేత్తలతో సంగీత అండ్ బ్యాచ్కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వారిని విచారించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. వారిలో ఎంతమంది నేరుగా డ్రగ్స్ తీసుకున్నారు ? వాళ్లంతా కేవలం వినియోగదారులేనా.. .పెడలర్స్గా మారి.. ఇంకా ఎవరికైనా సరఫరా చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.