నల్లమందు ముఠా పట్టివేత: ఎక్కడి తెచ్చేవారు, ఎలా...
నగరంలోని మియాపూర్లో మత్తుమందు స్థావరంపై ఎస్వోటీ, స్థానిక పోలీసులు దాడి చేసి కిలోన్నర ఓపియం (నల్లమందు)తో పాటు రూ.26.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని మియాపూర్లో మత్తుమందు స్థావరంపై ఎస్వోటీ, స్థానిక పోలీసులు దాడి చేసి కిలోన్నర ఓపియం (నల్లమందు)తో పాటు రూ.26.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
గురువారం మియాపూర్ పోలీస్స్టేషన్లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్, ఏసీపీ రవికుమార్, ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్ రాష్ట్రం పాలి జిల్లా రానవాస్ గ్రామానికి చెందిన సోదరులు మంగీలాల్ చౌదరి(30), కిషన్లాల్ చౌదరి(24) హైదరాబాద్కు వలస వచ్చి మియాపూర్ మక్తా మహబూబ్పేట్లోని ప్లాట్ నంబర్ 18,19 లోని ఇంటి నంబర్ 1-1లో నివాసముంటున్నారు.
స్వగ్రామం నుంచే...
స్వగ్రామానికి చెందిన మంగీలాల్ చౌదరి అనే వ్యక్తి నుంచి ఈ ఇద్దరు సోదరులు రెండేళ్లుగా ఎన్డీపీఎస్ మెటీరియల్(ఓపియం)ను తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ బృందం, మియాపూర్ పోలీసులతో కలిసి గురువారం మంగీలాల్, కిషన్లాల్ నివాసంపై దాడి చేశారు.
ఇలా స్వాధీనం...
వారి నుంచి 1.4 కిలోల ఓపియం, 45 గ్రాముల ఓపియం ముడిసరుకుతోపాటు రూ.26.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఎన్నేళ్లుగా ఈవ్యవహారం కొనసాగుతోంది, ఎవరికి విక్రయిస్తున్నారు, ఎంతమంది పాత్ర ఉందన్న విషయంపై విచారణ జరుపుతున్నామని డీసీపీ పేర్కొన్నారు.
ఓపియం అంటే ఏమిటి...
ఓపియం అంటే నల్లమందు. గసగసాల మొక్కకు పూసే పువ్వు పక్వానికి వచ్చే దశలో అందులోంచి ఒక రకమైన ద్రవం వస్తుంది. ఆ ద్రవం నుంచి తయరు చేసే పదార్థాన్నే ఓపియం అంటారు. ఈ ఓపియంను రిఫైన్ చేస్తూ వెళ్తే హెరాయిన్గా మారుతుంది.
ఇలా తాగితే మత్తు...
ఉండలుగా ఉండే ఓపియంను ఒక గ్లాస్ నీటిలో వేసుకొని తాగితే మత్తు వస్తుంది. నాటు వైద్యంలో పలు రోగాలకు ఔషధంగా ఓపియం ఉపయోగపడుతుంది. నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్(ఎన్డీపీఎస్) యాక్ట్ 1985 ప్రకారం ఓపియంను వాడినా, కలిగి ఉన్నా, రవాణాచేసినా, కొనుగోలు చేసినా, విక్రయించినా నేరంగా పరిగణిస్తారు.