వీకెండ్ రచ్చ: చుక్కేసి పోలీసులకే చుక్కలు చూపించిన యువతులు, పట్టుబడ్డ మోడల్?
హైదరాబాద్: జూబ్లీహిల్స్ డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడే యువతీ యువకులు పోలీసుల పైనే రంకెలు వేయడం.. రోడ్డుపై రచ్చ రచ్చ చేయడం ఇటీవల కామన్ అయిపోయింది. తాజాగా డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ పలువురు యువతులు కూడా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు.మహిళా కానిస్టేబుళ్లతో పెనుగాలటకు దిగి నానా యాగీ చేశారు.
పట్టుబడ్డ విద్యార్థిని..:
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇదే క్రమంలో రోడ్ నం.45లో ఓ విద్యార్థిని నడుపుతున్న కారును ఆపారు. బ్రీత్ అనలైజర్తో టెస్టులు చేయగా.. ఆమె మోతాదుకు మించి మద్యం సేవించినట్టు గుర్తించారు.
పోలీసులకు చుక్కలు..:
డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడటంతో సదరు విద్యార్థిని కారును పోలీసులు సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సదరు యువతి మాత్రం పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నడిరోడ్డుపై వారికి చుక్కలు చూపించింది. మహిళా కానిస్టేబుళ్లను తోసేసింది. చివరకు బలవంతంగా ఆమెను కారు నుంచి దించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మరో యువతి కూడా:
జూబ్లీహిల్స్ లోనే మరో యువతి కూడా మద్యం సేవించి కారు నడుపుతూ పట్టుపడింది. దీంతో కారును సీజ్ చేసేందుకు ప్రయత్నించగా.. ససేమిరా అన్నది. ఎలాగోలా ఆమె కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. యువతిపై కేసు నమోదు చేశారు.
పట్టుబడ్డ మోడల్..:
పంజాగుట్టలోని దుర్గానగర్కు చెందిన ఓ మోడల్ జూబ్లీహిల్స్ రోడ్డు నం.36లో డ్రంకన్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడింది. అతి కష్టం మీద ఆమెను పోలీసులు కారును నుంచి కిందకు దించారు. కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. అదే మార్గంలో బంజారాహిల్స్కు చెందిన ప్రణయ్ అనే యువకుడు కూడా డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. వీకెండ్లో మొత్తం 60వరకు డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్టు సమాచారం.