వామ్మో ఆ డీఎస్పీ భీం రెడ్డి ఆస్తులు 300 కోట్లు పైమాటే!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీ గా చేస్తున్న భీం రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోదాల సమయంలో ఆయన అనారోగ్యానికి గురి కావటంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయిన వెంటనే అధికారులు ఆయనను అదుపులోకి తీసుకొని ఏసిబీ ఆఫీసుకు తరలించారు.
డీఎస్పీ భీం రెడ్డి, బినామీలకు చెందిన 16 ప్రాంతాలలో ఏసీబీ సోదాలు
జడ్జి ముందు హాజరు పరచగా, మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ గూడా జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో ఏసీబీ అధికారులు డీఎస్పీ భీం రెడ్డి, ఆయన బంధువులు, బినామీలకు చెందిన 16 ప్రాంతాలలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాలలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆయన ఆస్తులు 300 కోట్లకు పైమాటే
ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు 300 కోట్లకు పై మాటే అని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇళ్ళు, ఆస్తులపై ఏకకాలంలో జరిపిన తనిఖీలలో ఆయన దగ్గర 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి , 43.6 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు 23 విదేశీ మద్యం బాటిల్స్ కూడా లభించాయి.
ఈ ప్రాంతాలలో కూడా ఆస్తులు, లగ్జరీ విల్లాలు
ఇది మాత్రమే కాక ఆయనకు హైదరాబాద్లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర్ ప్రాంతాలలో ఓపెన్ ప్లాట్లు, ఇబ్రహీం బాగ్ లో ఒక లగ్జరీ విల్లా ఉన్నాయి. వీటితోపాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాదు ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో భీం రెడ్డి ఇంట్లో ఒక రహస్య డైరీని కూడా గుర్తించి, అందులో ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
బినామీలు అందరికీ త్వరలోనే నోటీసులు
ఈ డైరీ ఆధారంగా 15 మంది బినామీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భీం రెడ్డి వద్ద గతంలో పనిచేసిన ఒక మాజీ హోంగార్డ్, వాచ్ మెన్ పేర్ల పై కూడా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అయితే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బినామీలు అందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.
పలు లాకర్లను తెరిచి పరిశీలించేందుకు ఏర్పాట్లు
కోర్టు అనుమతితో భీం రెడ్డి కి చెందిన పలు లాకర్లను తెరిచి పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు ఆయన గతంలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేశాడు అన్న ఆరోపణలు ఆయన మీద ఉండటంతో ఆ కోణంలో కూడా పరిశీలన చేస్తున్నారు ఏసీబీ అధికారులు .












Click it and Unblock the Notifications