ఆ ఆస్పత్రి ఔదార్యం... తెలంగాణ కరోనా పేషెంట్కు రూ.1.52కోట్ల బిల్లు మాఫీ..
కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్న పేషెంట్స్ లక్షల రూపాయల బిల్లుల్ని చూసి షాక్ తింటున్న సంగతి తెలిసిందే. బిల్లులు చెల్లించకపోతే పేషెంట్లను ఆస్పత్రిలోనే నిర్బంధిస్తున్న ఘటనలను కూడా చూస్తున్నాం. కానీ ఓ ఆస్పత్రి ఓ కరోనా పేషెంట్ చికిత్సకు అయిన రూ.1.52 కోట్లు బిల్లును మాఫీ చేసి తమ ఔదార్యతను చాటుకుంది. అయితే ఇది భారత్లో జరిగిన ఘటన కాదు. దుబాయ్లోని ఓ ఆస్పత్రి యాజమాన్యం కరోనా చికిత్స పొందిన ఓ తెలంగాణ వాసి పట్ల ఇలా ఉదారంగా వ్యవహరించింది.

జగిత్యాల వాసి...
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన రాజేష్ లింగయ్య ఒడ్నాల(42) ఉపాధి కోసం దుబాయ్ వలస వెళ్లాడు. గత రెండేళ్లుగా అక్కడే భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 23న అతను అనారోగ్యం బారిన పడగా... గల్ఫ్ కార్మికుల రక్షణ సంఘం అధ్యక్షుడు నరసింహ ఏప్రిల్ 2న అతన్ని దుబాయ్లోని అల్ ఖలీజా రోడ్లో ఉన్న ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ అతనికి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్గా తేలింది.

1.52కోట్ల బిల్లు..
దాదాపు 80 రోజుల పాటు లింగయ్య ఆ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. నరసింహ ప్రతీరోజూ ఆస్పత్రికి వెళ్లి అతని యోగ క్షేమాలు కనుక్కునేవాడు. 80 రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆస్పత్రి యాజమాన్యం అతనికి 7,62,555 దిర్హమ్లు బిల్లు వేసింది. అంటే భారత కరెన్సీలో రూ1.52 కోట్లు. దీంతో నరసింహ దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ వాలంటరీ సుమంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆపై ఇండియన్ కాన్సులేట్ అధికారి హర్జీత్ సింగ్ను ఆశ్రయించి అతని పరిస్థితి గురించి వివరించారు.

మాఫీ చేసిన ఆస్పత్రి..
హర్జీత్ సింగ్ ఈ విషయమై ఆస్పత్రి యాజమాన్యానికి ఓ లేఖ రాశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం.. బిల్లు మొత్తాన్ని మాఫీ చేసింది. అంతేకాదు,లింగయ్య హైదరాబాద్ చేరుకునేందుకు ఖర్చులకు కూడా ఆర్థిక సాయం చేసింది. అతని గల్ఫ్ సహచరులు రూ.10వేలుతో పాటు ఫ్లైట్ టికెట్లు ఇచ్చారు. ద్యావర కనకయ్య అనే వ్యక్తిని అతనికి తోడుగా హైదరాబాద్ పంపించారు. దీంతో బుధవారం తెల్లవారుజామున వీరిద్దరు ఎయిర్ ఇండియా విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.

నేరుగా స్వగ్రామానికి...
శంషాబాద్లో దిగిన అనంతరం ఎన్ఆర్ఐ అధికారులు చిట్టిబాబు,రాజేష్ లింగయ్యను రిసీవ్ చేసుకున్నారు. అక్కడినుంచి నేరుగా లింగయ్యను ఆయన స్వగ్రామానికి తరలించారు. ప్రస్తుతం అతను 14 రోజుల క్వారెంటైన్లో ఉన్నాడు. కాగా,రాజేష్ భార్య గ్రామంలోనే దోబీగా పనిచేస్తూ.. వ్యవసాయ పనులకు కూడా వెళ్తుంది. ఆయనకు కూతురు మౌనిక (18), కుమారుడు(16) ఉన్నారు. మౌనిక బీకామ్ చదువుతుండగా.. మధు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.












Click it and Unblock the Notifications