దుబ్బాక ఉప ఎన్నికలకు నేడే నోటిఫికేషన్: నామినేషన్ల పర్వం.. హీటెక్కిన రాజకీయాలు
దుబ్బాక లో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. ఈరోజు దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలలో హడావిడి కనిపిస్తోంది. నేటి నుండి 16వ తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరుగనుంది.
నేటి నుండి ఈ నెల 16 వరకు నామినేషన్ల స్వీకరణ
దుబ్బాక ఉప ఎన్నికకు నేటి నుండి నామినేషన్ల జాతర మొదలుకానున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి మూడు గంటల లోపు నామినేషన్లు వేయడానికి సమయాన్ని నిర్ధారించారు ఎన్నికల అధికారులు. కరోనా నేపథ్యంలో నామినేషన్ వేయడానికి కూడా పలు నిబంధనలు విధించారు. నామినేషన్ వేయడానికి గతంలో అభ్యర్థితో పాటు నలుగురికి అనుమతి ఉండేది. అయితే కరోనా నేపథ్యంలో నామినేషన్ వేయడానికి ఇద్దరికి మాత్రమే అనుమతినిచ్చారు అధికారులు.
నవంబర్ 3 న పోలింగ్ .. దుబ్బాకలో ఎన్నికల కోడ్
ఈనెల 16వ తేదీ వరకు నామినేషన్లను అనుమతించిన అధికారులు రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కావడంతో నామినేషన్ వేయడానికి అవకాశం లేదని చెప్పారు. 16 వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే, నామినేషన్ల పరిశీలన ఈనెల 17వ తేదీన చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా నవంబర్ 10వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు. ఇప్పటికే దుబ్బాక నియోజక వర్గంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేస్తున్నారు.
దుబ్బాకపై ఎన్నికల అధికారుల ప్రత్యేక నిఘా
గత ఎన్నికల సమయంలో బైండోవర్ చేసిన వారిని ముందుగానే అరెస్టు చేస్తున్నారు. మద్యం, నగదు పంపిణీ విషయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉప ఎన్నికల కోసం పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్న అధికారులు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఓటర్లను ప్రలోభాలకు గురి కానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి వస్తున్న రాజకీయ నాయకుల రాకపోకలపై కూడా ఎన్నికల అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించారు. పార్టీల ప్రచారాన్ని పరిశీలిస్తున్నారు.
Recommended Video
రాజకీయ పార్టీల్లో ఎలెక్షన్ హీట్
ఎలాంటి సభలు ర్యాలీలు నిర్వహించాలని అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. 48 గంటల ముందు అనుమతి తీసుకుంటేనే సభలు, సమావేశాలు జరుపుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాగా, ప్రధాన రాజకీయ పార్టీల నేతలు దుబ్బాక ఎన్నికలపై దృష్టి సారించారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలను ఎక్కు పెడుతూ దుబ్బాక నియోజక వర్గంలో రాజకీయ వేడిని బాగా పెంచారు. ఈసారి ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ తో పాటుగా కాంగ్రెస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో చాలా సీరియస్ గా దుబ్బాక ఎన్నికలపై వ్యూహాలు రచిస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు.