దుబ్బాకలో ప్రశాంతంగా పోలింగ్... చిట్టాపూర్లో ఓటేసిన టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత
దుబ్బాకలో మంగళవారం(నవంబర్ 3) ఉదయం 7గంటల నుంచి పోలింగ్ మొదలైంది. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత.. దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు,ఉదయం 6గంటలకు పోలింగ్ కేంద్రాల్లో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం 6.45గంటలకే ఓటర్లు చేరుకోవడం విశేషం. దుబ్బాకలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలే కావడంతో... వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఉదయాన్నే ఓటు వేయడానికి మొగ్గుచూపుతున్నారు.
సోమవారం రాత్రి(నవంబర్ 2) టీఆర్ఎస్-బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పటికీ... ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ జరుగుతోంది. నియోజకవర్గంలోని మొత్తం 148 గ్రామాల్లో 315 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఇందులో 89 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. కోవిడ్ 19 మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు మొదట ఆశా వర్కర్స్ వద్దకు వెళ్లి చేతులను శానిటైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆశావర్కర్లు వారికి చేతి గ్లౌజులు అందజేస్తారు. ఆపై థర్మల్ స్క్రీనింగ్ చేసి ఓటర్లను లోపలికి అనుమతిస్తారు. చేతులకు గ్లౌజులు తొడుక్కునే ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. సాయంత్రం 5గం. నుంచి 6గంటల వరకు కోవిడ్ 19 పేషెంట్లకు ఓటు అవకాశం కల్పించనున్నారు. వారికి పీపీఈ కిట్లు అందజేయనున్నారు.
ఎవరి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం దుబ్బాకలో మొత్తం 1,98,807 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో పోలింగ్ తగ్గుతుందా అన్న సందేహాలు లేకపోలేదు. మొత్తం ఓటర్లలో మహిళా ఓటర్లు 1,00,778 కాగా.. పురుష ఓటర్లు 97,098 మంది ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకం కానున్నాయి.
మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. గెలుపుపై మూడు పార్టీలు ధీమాగా ఉండటంతో దుబ్బాక ఓటరు ఎవరి వైపు నిలబడుతాడదన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నవంబర్ 10న ఉపఎన్నిక ఫలితాలు వెల్లడికానున్నాయి.