దుబ్బాకలో రంజుగా రాజకీయం; రఘునందన్ వర్సెస్ కొత్త ప్రభాకర్ రెడ్డి.. అసలు మ్యాటర్ ఇదే!!
దుబ్బాకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే దుబ్బాక కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. దుబ్బాక బస్టాండ్ ప్రారంభోత్సవం సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ, బి జె పి, బి ఆర్ ఎస్ కార్యకర్తల బాహాబాహి వెరసి ప్రతి ఒక్కరి దృష్టి దుబ్బాక పై కేంద్రీకృతమయ్యేలా చేసింది.
దుబ్బాకపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోకస్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రాజకీయం సాగుతుంది. అసలు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఏమిటి అన్న చర్చ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో యాక్టివ్ గా తిరుగుతూ, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ, నియోజకవర్గంలోని నేతలను కూడా కలుపుకు పోతూ ముందుకు సాగుతున్నారు. అంతే కాదు నియోజకవర్గస్థాయిలో జరిగే సభలు, సమావేశాలకు, వివిధ కార్యక్రమాలకు తప్పకుండా హాజరు అవుతున్నారు.
దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి పోటీ కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక నియోజకవర్గం అంటే తనకు ఎంతో అభిమానం అని చెబుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ను తాను తన సొంత నియోజకవర్గంగా భావిస్తున్నానని చెబుతూ దుబ్బాక చుట్టూనే తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికలలో దుబ్బాక నుండి ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దిగాలని కొత్త ప్రభాకర్ రెడ్డి ఆలోచిస్తున్నారన్నది దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలోకి దుబ్బాక నుండి దిగాలి అనుకుంటున్న విషయాన్ని ఆయన సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్లు తెలుస్తుంది.
దుబ్బాక స్థానం కోసం ఎప్పటి నుండో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆశలు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం కొత్త ప్రభాకర్ రెడ్డి శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు ఆయనకు టిక్కెట్టు దక్కలేదు. దివంగత రామలింగ రెడ్డి కి దుబ్బాక నియోజకవర్గ టిక్కెట్ ను సీఎం కేసీఆర్ కేటాయించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే గా ఉన్న రామలింగారెడ్డి మరణించడంతో దుబ్బాక స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పుడు కూడా రామలింగారెడ్డి సతీమణికి సెంటిమెంట్ గా అవకాశం కల్పించారు గులాబీ బాస్ కెసిఆర్. దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి బిజెపి అభ్యర్థి రఘునందన్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు.
టికెట్ కోసమే దుబ్బాక చుట్టూ తిరుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డి
ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న కారణంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక లో తిష్ట వేసి రాజకీయాలు చేస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే బిజెపి ఎమ్మెల్యే అయిన రఘునందన్ రావుకు , కొత్త ప్రభాకర్ రెడ్డి కి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఈసారి ఎలాగైనా టికెట్లు దక్కించుకుని దుబ్బాక లో విజయకేతనం ఎగురవేయాలని కొత్త ప్రభాకర్ రెడ్డి కలలు కంటున్నారు.
దుబ్బాక టికెట్ విషయంలో ఆయనకు ప్లస్ ఇవే .. మైనస్ ఏమిటంటే
హరీష్ రావు కు దగ్గరగా ఉండే, అలాగే ఆర్థికంగా వనరులు పుష్కలంగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక నుండి టికెట్ ఇవ్వడానికి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చు కానీ, దుబ్బాక స్థానాన్ని కొత్త ప్రభాకర్ రెడ్డి కేటాయిస్తే మెదక్ ఎంపీగా బరిలో నిలపడానికి అభ్యర్థి ఎవరు ఉంటారు అన్న దానిపైన ఆలోచించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఏది ఏమైనా దుబ్బాక నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగడం కోసమే దుబ్బాక పై ఫోకస్ చేసి కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త రాజకీయం చేస్తున్నారని నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే రఘునందన్ రావు వర్సెస్ కొత్త ప్రభాకర్ రెడ్డి రాజకీయం రంజుగా మారనుంది.