అండర్ గ్రౌండ్ లో 40 కోట్లు.. ఈసీకి ఫిర్యాదు.. 4 రూపాయలు కూడా దొరకని వైనం
ఎన్నికల వేళ బిజీబిజీగా ఉన్న రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు పెద్ద భారంగా పరిణమిస్తున్నాయా? ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితులున్నాయా? ఇలాంటి ప్రశ్నలకు తాజాగా జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. కొత్తగూడెం జిల్లా సాటివారిగూడెంలో టీఆర్ఎస్ కార్యకర్త 40 కోట్ల రూపాయలు భూమిలో దాచిపెట్టారనే అంశం ప్రస్తావిస్తూ ఎన్నికల అధికారి రజత్ కుమార్ కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ఫిర్యాదు అందిన వెంటనే నియోజకవర్గాల అధికారులను అప్రమత్తం చేశారు రజత్ కుమార్.

ఎన్నికల అధికారి ఆదేశాలతో కొత్తగూడెం నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్డీవో స్వర్ణలత ఫిర్యాదుదారు సూచించిన అడ్రస్ కు వెళ్లి పరిశీలించారు. బుల్డోజర్ తో దాదాపు 6 గంటల పాటు తవ్వకాలు జరిపించారు. అయితే అక్కడ ఎలాంటి డబ్బు దొరకలేదు. దీంతో ఆ ఫోన్ కాల్ ను డమ్మీగా గుర్తించిన అధికారులు.. భద్రతాకారణాల వల్ల ఫిర్యాదుదారు పేరు వెల్లడించడం లేదని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం సరికాదనే నిర్ణయానికి వచ్చారు అధికారులు. మొత్తానికి తప్పుడు ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications