Bandi Sanjay vs Eatala: తెలంగాణలో ఈ "బండి"తో గెలవలేం.. అమిత్ షాకు ఈటల సంచలన రిపోర్ట్..?
Bandi Sanjay vs Eatala:బీజేపీలో లుకలుకలు బయటపడుతున్నాయా..? విబేధాలు తారాస్థాయికి చేరుతున్నాయా..? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహార శైలిపై పలువురు సీనియర్లు గుర్రుగా ఉన్నారా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో రాజకీయం వేడెక్కుతోంది. అంతర్గతంగా విబేధాలు బయటపడుతున్నాయి. బండి సంజయ్ను వెంటనే రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దల వరకు తీసుకెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కర్నాటక రాష్ట్రంలో బీజేపీకి షాక్ తగిలిన తర్వాత పక్కరాష్ట్రమైన తెలంగాణ బీజేపీ అలర్ట్ అయ్యింది. కాస్తో కూస్తో తెలంగాణలో వాయిస్ వినిపిస్తున్న బీజేపీలో నాయకులు మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల మద్దతును కూడగట్టడంలో బండి సంజయ్ విఫలమవుతున్నారంటూ బీజేపీ హైకమాండ్కు ఫిర్యాదులు వెళుతున్నట్లు సమాచారం.అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ పరిస్థితి కాస్త అగమ్యగోచరంగా కనిపిస్తోందంటూ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

తాజాగా ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ హైకమాండ్ నియమించిన కమిటీకి ఈటల రాజేందర్ నేతృత్వం వహిస్తున్నారు.ఈ మధ్యనే ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను ఈటల కలిసినట్లు సమాచారం. ఈ భేటీలో బండి సంజయ్ నాయకత్వంపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఈటల అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీలో రెండు వర్గాలు తయారైనట్లు తెలుస్తోంది.
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని ఈటల చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ నాయకత్వంలో క్యాడర్ బలపడటం లేదని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.పార్టీ బలోపేతం కోసం ఈటల ఆరు పాయింట్లతో కూడిన సంస్కరణల ప్రతిపాదనలు అమిత్ షా ముందుంచినట్లు సమాచారం. ఇందులో పాత కొత్త నేతల మధ్య సమన్వయం అనే అంశం కూడా చేర్చినట్లు తెలుస్తోంది.
బండి సంజయ్ ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ప్రసంగించినా కేవలం హిందుత్వ అంశం మాత్రమే తీసుకురావడంతో ఇతరులు బీజేపీకి దూరమవుతున్నారన్న విషయాన్ని ఈటల రాజేందర్ అమిత్ షాకు చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్నాటకలో హిందుత్వ మోడల్ పనిచేయలేదని ఈ క్రమంలోనే బండి సంజయ్ను మార్చి అనువైన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని ఈటల సూచించారట.ఇదే అంశంపై బీజేపీ హైకమాండ్ బండి సంజయ్తో మాట్లాడాలని భావిస్తోందట.

తెలంగాణలో మతపరమైన రాజకీయాలు పనిచేయవన్న అభిప్రాయంతో ఈటల రాజేంద్ర ఉన్నారు.అదే జరిగితే కర్నాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయన్న విషయాన్ని గ్రహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమలదళంలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. ఇది కాంగ్రెస్కు అనుకూలంగా మారే ఛాన్స్ ఉంది. మరోవైపు పలువురు కమలం నేతలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు సమాచారం.
ఇక ఎన్నికలకు ముందు పార్టీలో బండి సంజయ్ పై నేతల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.నాయకులు మధ్య ఐక్యత లేకపోతే బీజేపీ పరిస్థితి చేదాటిపోయే అవకాశం ఉంది.దీంతో బండి సంజయ్ను మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. నేతల్లో అసమ్మతి పెరిగితే వారిని బుజ్జగించడం మరో సవాలుగా బీజేపీకి మారుతుంది.అయితే బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది. బీజేపీ నుంచి నాయకులు కాంగ్రెస్కు వస్తామంటే వారికి రెడ్ కార్పెట్తో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది.












Click it and Unblock the Notifications