తెలంగాణలో మోగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
న్యూఢిల్లీ: తెలంగాణలో మరో ఎన్నికల రణరంగానికి తెర లేచింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం జారీ చేసింది. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో మొత్తం 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. దీనికి డిసెంబర్ 2న నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొ స్థానానికి... కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు చొప్పున మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి కాలం 2013 మేలోనే ముగిసింది. కానీ ఎన్నికలు జరపలేదు.

2015 మేలో 8 మంది పదవి కాలం ముగిసింది. మరో మూడు నియోజక వర్గాలు కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 12 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.
నామినేషన్లకు చివరి తేదీ డిసెంబర్ 9. పరిశీలన 10న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ 12వ తేదీ. పోలింగ్ 27న జరుగుతుంది. డిసెంబర్ 30వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్లో చెప్పారు.












Click it and Unblock the Notifications