మరో మలుపు: టేపుల కోసం ఈసీ పిటిషన్, మత్తయ్య అత్తారింటికెళ్లొద్దా: జూపూడి
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో మరో మలుపు. ఎలక్షన్ కమిషన్ గురువారం ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ పంపిన హార్డ్ డిస్క్, టేపుల కాపీని తమకు అందించాలని మెమోలో పేర్కొంది. కాగా, హార్డ్ డిస్క్, టేపులను పరిశీలించిన తర్వాతే రేపు ఏసీబీ కోర్టుకు అందిస్తామని న్యాయస్థానం చెప్పింది.
సెక్షన్ 8పై గాలి
హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. చంద్రబాబు ఏపీ సీఎంగా 2015 జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారని, జూన్ 24న ప్రధాని మోడికి లేఖ రాశారని చెప్పారు. దీనిపై కేంద్రం ఆగస్టు 6న హోంసెక్రటరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తే.. సెక్షఖన్ 8ను అమలు చేసేది లేదని కేసీఆర్ చెప్పారన్నారు. అప్పటి నుండే వివాదం మొదలైందన్నారు.
స్టీఫెన్ ఫాంహౌస్కు వెళ్తే మత్తయ్య అత్తారింటికి వెళ్లొద్దా: జూపూడి
కేసీఆర్ ఏపీ ప్రభుత్వం పైన విషం చిమ్ముతున్నారని మరో టీడీపీ నేత జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. స్టీఫెన్ సన్ సీఎం కేసీఆర్ ఫాంహౌస్లో ఉన్నప్పుడు మత్తయ్య అత్తారింటికి వెళ్లవద్దా అని నిలదీశారు. కోర్టులో మత్తయ్య పిటిషన్ వేస్తే అక్కడ ఉన్న జడ్జిలను మార్చాలనే నీచ సంస్కృతికి తెరలేపారన్నారు.
రాజ్యాంగ వ్యవస్థ పైన టీఆర్ఎస్కు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. స్టీఫెన్ సన్ పాత్ర అనుమానాస్పదంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణ మంత్రులు, అధికారులు అడ్డంగా దొరికారన్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గవర్నర్ పైన కేసీఆర్కు గౌరవం లేదని, కేజ్రీవాల్ 2గా మారుతున్నారన్నారు.