గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ- తెలంగాణ సీఎస్కు ఆదేశాలు..!!
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
యధాతథంగా షెడ్యూల్ ప్రకారమే ఈ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితే తలెత్తితే మాత్రం అక్టోబర్/నవంబర్లల్లో నోటిఫికేషన్ వెలువడుతుంది. డిసెంబర్లో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిపోతుంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికోసం అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోన్నాయి.

ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బ్రేక్ త్రూ లభించింది. అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ఆ పార్టీకి తీపి కబురు అందింది. బీజేపీ అభ్యర్థిని డీకే అరుణను గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యురాలిగా ప్రకటించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది.
2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి ఆమె శాసన సభ్యురాలిగా ఎన్నికైనట్లు తెలంగాణ స్టేట్ గెజిట్లో ప్రచురించాలని సూచించింది. ఈ మేరకు తక్షణమే గెజిట్ జారీ చేయాలనీ పేర్కొంది. శాసనసభలో ఎన్నికైన సభ్యుల జాబితాలో కూడా డీకే అరుణ పేరును చేర్చాలంటూ సూచించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఈసీ అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థినిగా పోటీ చేసిన డీకే అరుణ ఓడిపోయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతిలో సుమారు 28 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయాన్ని చవి చూశారు. రెండో స్థానంలో నిలిచారు.
ఆయన ఎన్నిక చెల్లదంటూ డీకే అరుణ న్యాయపోరాటం చేశారు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పోరాటంలో ఆమె విజయం సాధించారు. వాదోపవాదాలు, డీకే అరుణ సమర్పించిన డాక్యుమెంట్లను క్షున్నంగా పరిశీలించిన అనంతరం.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో- రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలంటూ ఈసీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications