కోటి లంచం: అశ్విన్ రావ్ రూ. 5.5 కోట్ల ఆస్తి జప్తు
బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటక లోకాయుక్త మాజీ న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ కుమారుడు వై. అశ్విన్ రావ్ (హైదరాబాద్ నివాసి) కు చెందిన సుమారు రూ. 5.5 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు.
అశ్విన్ రావ్ అక్రమంగా ఆస్తులు సంపాధించాడని ఈడీ అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, బెంగళూరు, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అశ్విన్ రావ్ అక్రమంగా ఆస్తులు సంపాధించారని అధికారులు గుర్తించారు.
కర్ణాటక లోకాయుక్తలో అవినీతి జరిగిందని ఎస్ఐటీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే సందర్బంలో రూ. కోటి లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో అశ్విన్ రావ్ తో పాటు అతని అనుచరులను ఎస్ఐటీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
సుధీర్ఘకాలంగా సెలవులో ఉన్న వై. భాస్కర్ రావ్ చివరికి కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. లోకాయుక్త అధికారుల దర్యాప్తుతో పాటు ఈడీ అధికారులు విచారణ మొదలు పెట్టారు.
దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త అధికారులు అశ్విన్ రావ్ అక్రమంగా రూ. ఒక కోటి నగదు బదిలి చేశాడని గుర్తించారు. తరువాత రంగంలోకి దిగిన ఈడీ అధికారులు అశ్విన్ రావ్ అక్రమ ఆస్తులు గుర్తించి జప్తు చేశారు.
డాక్టర్ విల్సన్ అనే వ్యక్తి అశ్విన్ రావ్ కు నగదు ఇచ్చాడని విచారణలో వెలుగు చూసింది. కర్ణాటక లోకాయుక్తలో జరిగిన అవినీతి కేసులో అశ్విన్ రావ్ మొదటి ముద్దాయి. ఈ కేసులో ఇప్పటికే అనేక మంది అరెస్టు అయ్యారు.