నేతల పంచెలు తడుస్తున్నాయ్: హైదరాబాద్లో అర్ధరాత్రి ఈడీ సోదాలతో బెంబేలు: కండువా మార్చేస్తే సేఫా
హైదరాబాద్: ప్రస్తుతం దేశ రాజకీయాలన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చుట్టూ తిరుగుతోన్నాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవలే ఈడీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించడం.. దానికి అనుబంధంగా ఆ పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశంపై అటు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
ఈడీ చుట్టూ..
కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు లోక్సభ, రాజ్యసభలను స్తంభింపజేశారు. ఈడీ అధికారులు చేస్తోన్న మెరుపుదాడులు, ఆకస్మిక సోదాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయ్యాయి. పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడుతోన్నాయి. కేంద్ర ప్రభుత్వం.. దర్యాప్తు సంస్థల అధికారాలను దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ప్రతిపక్ష సభ్యులతో జట్టు కట్టింది.
హైదరాబాద్లో మెరుపుదాడి..
అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉద్వాసనకు గురైన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ వంటి రాజకీయ నాయకుల నివాసాలపై దాడులు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య హైదరాబాద్లో ఈడీ అధికారులు మెరుపుదాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్ధరాత్రి ఈ దాడులు మొదలయ్యాయి. తార్నాకలోని ఇల్యాజ్ ఫారూఖీ అనే రైల్వే కాంట్రాక్టర్ నివాసంపై దాడులు చేశారు.
హర్యానా నుంచి..
కాంట్రాక్ట్ పనుల్లో రైల్వే మంత్రిత్వ శాఖకు 100 కోట్ల రూపాయలకు పైగా మోసగించారనే ఆరోపణలు ఇల్యాజ్ ఫారూఖీపై ఉన్నాయి. ఈ దాడుల సందర్భంగా పలు కీలక పత్రాలను వారు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ గల వాహనంలో ఈడీ అధికారులు తార్నాక మర్రి చెన్నారెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఫారూఖీ నివాసానికి చేరుకున్నారు. ఆయన వ్యాపారాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. నగదు బదిలీలపై ఆరా తీశారు.
రాజకీయ పలుకుబడి ఉందా?
ఫారూఖీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు రైల్వే కాంట్రాక్ట్ పనులను నిర్వహిస్తోన్నారని, కన్సల్టెన్సీ బిజినెస్లో కొనసాగుతున్నారని తేలింది. వివిధ రైల్వే జోన్ల నుంచి బ్రిడ్జీల నిర్మాణం, పట్టాల నిర్వహణ వంటి కాంట్రాక్ట్ పనులను ఫారూఖీ పొందేవాడని, కొన్ని నకిలీ బిల్లులను సృష్టించి రైల్వే మంత్రిత్వ శాఖకు 100 కోట్ల రూపాయల మేర మోసగించినట్లు పిర్యాదులు అందడంతో ఈడీ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు చెబుతున్నారు. ఆయన సోదరుడికి రాజకీయంగా పలుకుబడి ఉందని తెలుస్తోంది.