ఈడీ చేతికి ఎమ్మెల్యేల ఎర కేసు.. టెన్షన్ పడుతున్న పైలట్ రోహిత్ రెడ్డి.. ఎందుకంటే!!
పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఫామ్ హౌస్ లో గులాబీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్ దర్యాప్తుకు విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం, సిట్ దర్యాప్తు లో కీలక ముందడుగు వేయలేకపోయింది. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడం ముందు ముందు ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి అన్నదానికి కారణంగా మారింది. అంతేకాదు కొనుగోలు వ్యవహారంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా టెన్షన్ పడేలా చేస్తుంది.

నేడు, రేపు నందకుమార్ ను విచారించనున్న ఈడీ
మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నందకుమార్ ని విచారించడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నాంపల్లి కోర్టు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేసిన కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నందకుమార్ ను రెండు రోజుల పాటు విచారణ చేయనుంది. అయితే క్రిస్మస్ సెలవులు ఉన్న కారణంగా ఈనెల 26, 27 వ తేదీన, నేడు, రేపు నందకుమార్ ను విచారణ జరపనుంది. దీంతో ఈ విచారణలో నందకుమార్ ఏం చెప్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

టెన్షన్ పడుతున్న పైలట్ రోహిత్ రెడ్డి .. సంచలన వ్యాఖ్యలు
ఇక నందకుమార్ ను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి నందకుమార్ స్టేట్మెంట్ ఆధారంగా తనను ఇరికించటానికి ప్రయత్నం చేస్తున్నారని, ఈడీ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి కొత్త కుట్రలకు తెరలేపింది అని, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను రంగంలోకి దింపి తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, బిజెపి ఎన్ని కుట్రలు చేసినా తాను మాత్రం తగ్గేది లేదని పైలట్ రోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి.

హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానన్న పైలట్ రోహిత్ రెడ్డి
నందకుమార్ ను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు. ఇప్పటికే ఈడీ అధికారులు పైలట్ రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించారు. ఎమ్మెల్యేల ఎర కేసు నుండి పైలట్ రోహిత్ రెడ్డిని విచారించినట్లుగా వెల్లడించిన పైలెట్ రోహిత్ రెడ్డి దీనికి సంబంధించి ఫిర్యాదు చేసిన తననే అధికారులు విచారించడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. తొలి రోజు తనను ఆరు గంటల పాటు విచారించారు అని, రెండో రోజు ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గురించి ప్రశ్నించారని, తనకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారించడం పై తాను హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.

పైలట్ రోహిత్ రెడ్డి టెన్షన్ కు కారణం ఇదే
ఒక పక్క సిట్ విచారణ జరిపి బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలకు ఉచ్చు బిగిస్తుంది అని భావిస్తే అందుకు భిన్నంగా ఈడీ రంగంలోకి దిగడంతో ఎమ్మెల్యేలు ఎర కేసులో ఉన్న ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి స్పందించడం వెనుక నందకుమార్ ఈడీ అధికారులు విచారించనుండటం కారణంగా కనిపిస్తోంది. నందకుమార్ కు పైలెట్ రోహిత్ రెడ్డి కి గతంలో బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయన్న విషయాలు, వారిద్దరి మధ్య అంతకు ముందు ఉన్న ఆర్థిక లావాదేవీలు ఈడీ విచారణతో బయటకు వస్తాయి అన్న ఆందోళనలో, తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఈడీ అధికారులపై ఎదురుదాడి మొదలుపెట్టారు పైలట్ రోహిత్ రెడ్డి. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ కేసు ఈడీ అధికారులు ఎంట్రీతో కీలక మలుపు తిరుగుతుందని అందరూ భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications