ఆఫీసులోనే స్నానం చేసి రండి: మంత్రి ఈటలకు కరోనా కష్టాలు: కుటుంబ సభ్యుల నుండే...!
"రోజూ ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఆస్పత్రులకు వెళ్తున్నారు. వైద్యులు, రోగులతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఇంటికి వచ్చే ముందు ఆఫీసులోనే స్నానం చేసి రండి" రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్కు ఆయన కుటుంబ సభ్యులు ఇస్తున్న సూచనలు ఇవి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఈటల ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం తప్పనిసరని చెప్పారు.
వైరస్ సోకిన వారు తప్ప, ఇతరులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని అన్నారు.ఈ విషయంలో ప్రజలకు స్పష్టమైన సందేశం ఇవ్వటం కోసమే తాను మాస్కు ధరించటం లేదని చెప్పారు.గాంధీ ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డు ఏర్పాటును ఆయన సమర్థించారు. ఈ ప్రత్యేక వార్డును అక్కడి నుంచి తరలించాలన్న జూనియర్ డాక్టర్లను మందలించినట్లు తెలిపారు. వైద్య వృత్తిలో ఉన్నప్పుడు రోగులకు అందుబాటులో ఉండి చికిత్స చేయాలనే ఆలోచన మరవడం మంచిది కాదని హితవు పలికినట్లు చెప్పారు.

ప్రజల్లో ఉన్న అనుమానాలను, భయాలను తొలగించడానికి గాంధీలో పర్యటిస్తున్నట్లు ఈటల తెలిపారు. పాజిటివ్ వ్యక్తి తో పాటు కరోనా వైరస్ అనుమానం తో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చి వార్డులో ఉన్న వారితో కూడా మంత్రి స్వయంగా మాట్లాడారు. గాంధీ ఆసుపత్రిలో ఉన్న ఏర్పాట్లపై చర్చించారు. కరోనా వైరస్ పేషెంట్ల వద్ద ఉన్నప్పుడు మాత్రమే మంత్రి మాస్కులు ధరించి వెళ్లారు. హాస్పిటల్ లో పలువురు పేషెంట్ నేరుగా కలుసుకొని ట్రీట్మెంట్ పొందుతున్న విధానంపై చర్చించారు. అక్కడ ఎక్కడ కూడా మాస్కులు ధరించ కుండా పేషెంట్ల తో మాట్లాడి వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
కరోనా వైరస్ సోకిన వ్యక్తుల డ్రాప్ లెట్స్ ద్వారా మాత్రమే మరొకరికి వైరస్ సోకుతుంది తప్ప గాంధీ హాస్పిటల్ లో ఉన్న అందరికీ వైరస్ వల్ల ప్రమాదం ఉండే అవకాశమే లేదని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. వేరు వేరు వార్డులో ఉన్న పేషంట్ ని అడిగి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రి లో ఉన్న 7 ఫ్లోర్ లు కలియతిరిగారు. డాక్టర్లుగా ప్రజలకు అవగాహన కల్పించాల్సినబాధ్యత మరచిపోయి, మీరే ఆందోళన చెందటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
Recommended Video


కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉంది తప్ప ఐసొలేషన్ వార్డు ఇక్కడ ఉండటం వల్ల ఏ ఒక్కరికి కరోనా వైరస్ సోకదని స్పష్టం చేయడానికి తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. మంత్రిగా నేనే వచ్చినప్పుడు డాక్టర్ గా మీరు భయపడటం లో అర్థం లేదు అని వారికి నచ్చజెప్పారు. అంతేకాదు కరోనా వైరస్తో వ్యక్తిగతంగా తన వ్యాపారాల్లో భారీ నష్టం వాటిల్లిందని అది దాదాపు రూ.7 కోట్లు వరకు ఉంటుందని మంత్రి ఈటల చెప్పారు.












Click it and Unblock the Notifications