రేపే కౌంటింగ్ : 42 రోజుల నిరీక్షణకు తెర.. మధ్యాహ్నానికి ఫలితాలపై అంచనా..
తెలంగాణలో హోరాహోరిగా సాగిన ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. 42రోజుల నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. తెలంగాణలో గత నెల 11న ఎన్నికలు జరగగా.. అప్పటి నుంచి ఫలితాల కోసం రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి ఈవీఎంలలో ఓట్లతో సరిపోల్చనున్నారు.
మే 23కు రెడీ.. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఆంక్షలు.. మద్యం దుకాణాలు క్లోజ్
35 కౌంటింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో 35 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా.. ఉదయం 5.30గంటలకే కౌంటింగ్ సిబ్బంది విధులకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. 119అసెంబ్లీ నియోజకవర్గాల్లో 110 సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
మల్కాజ్గిరిలో 28 టేబుళ్లు
దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో 500లకుపైగా పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ అక్కడ రెట్టింపు సంఖ్యలో 28 టేబుళ్లు ఏర్పాటు చేసింది. మాల్కాజ్గిరిలో 30 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే అవకాశముంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అనంతరం ఈవీఎంలను తెరవనున్నారు. ఈవీఎంలో ఓట్లను లెక్కించిన తర్వాత లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్ మెషీన్ల స్లిప్పులను లెక్కించనున్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుకున్న తర్వాతే ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఒక్కో రౌండ్కు 30నిమిషాలు
ఓట్ల లెక్కింపునకు ఒక్కో రౌండ్కు 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశముంది. నిజామాబాద్ లోక్సభ సీటు పరిథిలోని 7 నియోజకవర్గాల్లో 35 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేసి ఓట్ల లెక్కించనున్నారు. నిజాబామాద్ బరిలో అత్యధికంగా 185మంది అభ్యర్థులు ఉన్నందున ఇందూరు ఫలితం ఆలస్యమవుతుందని ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ముందుకు ఖమ్మం చివరన నిజామాబాద్ పార్లమెంటు ఫలితం వెల్లడికానుంది.
మధ్యాహ్నానికి ఫలితంపై అంచనా
ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... మధ్యాహ్నానికి ఫలితాలపై ఒక అంచనా వచ్చే అవకాశముంది. కొన్ని నియోజకవర్గాల్లో 15 నుంచి 20 రౌండ్లలోనే స్పష్టమైన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే వీవీ ప్యాట్లను కూడా లెక్కించాల్సి ఉన్నందున తుది ఫలితం మాత్రం కొంత ఆలస్యయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత
కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10వేలమందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇవాళ సాయంత్రం నుంచే 144 సెక్షన్ అమలు చేయనున్నారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.