తెలంగాణలో 576 మంది పంచాయతీ ప్రజాప్రతినిధులకు ఈసీ షాక్... అనర్హత వేటు...
నల్గొండ జిల్లాకు చెందిన 42 మంది ఉప సర్పంచ్లు, 534 మంది వార్డు సభ్యులకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వీరు... ఖర్చుల లెక్కలను సమర్పించలేదన్న కారణంతో అనర్హత వేటు వేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ... వీరి నుంచి స్పందన లేకపోవడంతో చివరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో మొత్తం 576 మంది పదవులు కోల్పోయారు.
అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన 576 స్థానాలతో పాటు ఏడుగురు సభ్యులు మృతి చెందిన స్థానాలకు ఈసీ మళ్లీ ఎన్నికలు నిర్వహించనుంది. ఉపసర్పంచ్ అనర్హత వేటుకు గురైన పంచాయతీల్లో కోరం ఉంటే మరో సభ్యుడితో ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. కోరం లేనిపక్షంలో సర్పంచ్తో పాటు సంబంధిత అధికారికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నారు.
నల్గొండ జిల్లాలో జనవరి,2019లో 837 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో పోటీ చేసిన చాలామంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఖర్చుల వివరాలను సమర్పించలేదు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం... పోటీ చేసిన అభ్యర్థులంతా ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45 రోజుల్లో ఎంపీడీవో ఆఫీసుల్లో సమర్పించాలి. ఎన్నికల కమిషన్ రూపొందించిన ఫార్మాట్లోనే ఆ వివరాలు ఉండాలి.
ఈ నేపథ్యంలో ఖర్చుల వివరాలు వెల్లడించాలని నల్గొండ జిల్లాకు చెందిన చాలామంది పంచాయతీ ప్రజాప్రతినిధులకు ఈసీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది.వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల్లో గెలిచి ఖర్చులు సమర్పించనివారిపై తాజాగా అనర్హత వేటు వేసింది.
కొంతమంది అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఖర్చుల వివరాలు సమర్పించినప్పటికీ... నోటీసులకు సకాలంలో స్పందించకపోవడంతో అనర్హత వేటు వేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అనర్హత వేటు పడ్డవారిలో కొంతమంది అసలు తమకు నోటీసులే రాలేదని చెబుతుంటే.. మరికొందరు అసలు వాటి గురించే తెలియదని అంటున్నారు. జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ... ఈసీ నోటీసులకు స్పందించకపోవడం వల్లే వారిపై అనర్హత వేటు పడిందన్నారు.
నాలుగు రోజుల క్రితం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 1946 మంది ప్రజాప్రతినిధులపై కూడా ఈసీ అనర్హత వేటు వేసింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలు సమర్పించని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనూ పలువురు పంచాయతీ ప్రజాప్రతినిధులు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని కారణంగా,నోటీసులకు స్పందించని కారణంగా అనర్హత వేటుకు గురయ్యారు.