దళితబంధును నిలిపేయండి: హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ ఈసీ సంచలన ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో అక్టోబర్ నెలలో జరగనున్న ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. హుజూరాబాద్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని, ఎన్నిక తర్వాత యథావిధిగా కొనసాగించవచ్చని ఈసీ పేర్కొంది.

కాగా, హుజురాబాద్ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలు లేఖలు ఈసీకి అందాయి. అన్ని పార్టీల ఫిర్యాదులన్నీ కలిపి ఒక లేఖగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందింది. తెలంగాణ ఈసీ నుంచి అందిన నివేదిక ఆధారంగా దళిత బంధు నిలిపివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం ఈ పథకం ప్రారంభించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి కల్పన కోసం.. 30 రకాల పథకాలను, కార్యక్రమాల జాబితాను విడుదల చేసింది. క్షేత్రస్థాయిలో సర్వే అనంతరం మినీ డెయిరీ యూనిట్ నుంచి మినీ సూపర్ బజార్ వరకు వివిధ రకాల స్వయం ఉపాధి పథకాలను ఇందులో పొందుపరిచింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 30 పథకాల్లో తమకు నచ్చిన ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ఉపఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం కసరత్తులు చేసింది. అయితే, ఈసీ ఆదేశాలతో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ పథకం నిలిచిపోనుంది.
Recommended Video
కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో వివిధ పార్టీలకు చెందిన 30 మంది అభ్యర్థులు ఉన్నారు. అక్టోర్ 30న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఉపఎన్నికలో ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ఉండనుంది.












Click it and Unblock the Notifications