ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్ వద్దు: గవర్నర్కు ఫిర్యాదు, తెలంగాణకు ఈసీ ప్రతినిధులు!
హైదరాబాద్: తెలంగాణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావును కొనసాగించకూడదని రాష్ట్రానికి చెందిన ప్రతిపక్షాలు శుక్రవారం గవర్నర్కు లేఖ రాశారు. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు కలిసి గవర్నర్ నరసింహన్ అపాయింటుమెంట్ కోరాయి.
కేసీఆర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు వారు గవర్నర్ అపాయింటుమెంట్ అడిగారు. విపక్షాలు అన్నీ కలిసి కేసీఆర్ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగించవద్దని చెప్పడం గమనార్హం. కేసీఆర్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయనను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగించవద్దని ఆ పార్టీలు లేఖలో కోరాయి.

11న తెలంగాణకు ఈసీ ప్రతినిధులు
ఈ నెల 11వ తేదీన ఈసీ ప్రతినిధులు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయనున్నారు. సీనియర్ డిప్యూటీ కమిషనర్ ఉదయ సిన్హా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రానుంది.
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాలకు సంబంధించి నివేదిక ఇవ్వనుంది. తెలంగాణలో గురువారం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications