2019 ఎన్నికలు: ప్రతిపక్షాల జోరుకు కెసిఆర్ కౌంటర్ ఇదీ, నేతలకు ఆదేశాలు
2019లో జరగబోయే ఎన్నికలపై గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టడంతో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్: 2019లో జరగబోయే ఎన్నికలపై గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ప్రతిపక్షాలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టడంతో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తాయని భావిస్తున్న సీఎం కేసీఆర్.. ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు.
ప్రభుత్వ పథకాలు.. గడప గడపకు చేరేలా ప్రచారం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తరువాత తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. మేనిఫెస్టోలో ఉన్న అంశాలతో పాటు అందులోని లేని పథకాలూ అమలు చేస్తున్నారు. వీటిని పకడ్బందీగా అమలు చేస్తున్నా.. తగినంత ప్రచారం రావడం లేదనే భావన కేసీఆర్లో ఉంది. అందుకే ప్రభుత్వ పథకాలను గ్రామ గ్రామాన.. గడప గడపకు చేరేలా ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జూన్ 2వ వారం నుంచి మండల సమ్మేళనాలు..
ప్రభుత్వం చేపట్టిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, కార్యకర్తల్లో జోష్ నింపేలా మండల సమ్మెళనాలు నిర్వహించబోతున్నారు. జూన్ 2వ వారం నుంచి మండల సమ్మేళనాలు ప్రారంభమవనున్నాయి. ఈ సమ్మేళనాలకు ఆయా మండలంలోని పార్టీ కార్యకర్తలతో పాటు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నవారందరినీ తరలిస్తారు. ఇప్పటికే పార్టీ సభ్యత్వం 75 లక్షలు దాటినందున ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించేందుకు ఇదే సరైన వేదిక అని భావిస్తున్నారు.
అన్ని స్థాయిల నాయకులూ...
జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు విధిగా మండల సమ్మేళనాలకు హాజరుకావాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పథకాల వివరాలతో ప్రత్యేక నోట్ రెడీ చేశారు. వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతులకు రుణమాఫీ, నిరంతర విద్యుత్ సరఫరా, గురుకుల పాఠశాలలు, సాగు నీటి ప్రాజెక్టులు తదితర పథకాల వివరాలను మండల సమ్మేళనాలలో ప్రజలకు వివరిస్తారు.
ప్రసంగాలు కాదు.. ప్రజలకు అర్థమయ్యేలా..
ప్రసంగాలకు పోకుండా.. స్థానికంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే సూచించారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించడంతో గులాబీ శ్రేణులు కూడా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ ఆదేశిస్తున్నారు. మూడేళ్లుగా పేదల కోసం ప్రభుత్వం ఎన్నో చేస్తుందని, వాటినిప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, ఇందుకు స్థానికంగా ఉండే నేతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు గులాబీ దళపతి.