ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు..!!
ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 20న విచారణకు రావాలని సూచించింది.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో విడత విచారణ కోసం ఈ రోజు ఈడీ ముందు కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ, హాజరు కాలేదు. తన ప్రతినిధులను ఈడీ వద్దకు పంపారు. ఒక లేఖ రాసారు. అందులో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుందని..ఆ కేసు తేలే వరకూ విచారణ వాయిదా వేయాలని లేఖలో కోరారు. చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే తనకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి తన ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటానని స్పష్టం చేసారు. దీనిని పరిశీలించిన తరువాత ఈడీ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఈడీకి కవిత లేఖ.. మరోసారి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీకి రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ రోజు విచారణకు హాజరవుతానని చెప్పిన కవిత న్యాయ నిపుణులతో సుదీర్ఘ మంతనాలు చేసారు. ఆ తరువాత తన ప్రతినిధులతో ఈడీకి లేఖ పంపారు. లేఖతో పాటుగా ఈడీ అధికారులు కోరిన బ్యాంకు స్టేట్ మెంట్లు ఇతర వివరాలను జత చేసారు. అదే లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని కోరారు. మహిళను ఈడి ఆఫీస్ కి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్ లో ఉందనే విషయాన్ని తన లేఖలో స్పష్టం చేసారు. ఇప్పటికే కవిత ఇవే అంశాల పైన సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ నెల 24న సుప్రీంలో ఈ పిటీషన్ విచారణకు రానుంది.

ఈ నెల 20న విచారణకు హాజరవ్వాలంటూ
ఈ లేఖను పరిశీలించిన ఈడీ మరోసారి కవితకు సమన్లు ఇచ్చింది. ఈ నెల 20న విచారణకు రావాలని అందులో స్పష్టం చేసింది. ఇదే సమయంలో అటు ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రామచద్ర పిళ్లై కస్టడీ పొడిగింపు పైన ఈడీ కోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో కవితతో పాటుగా పిళ్లైను విచారించాల్సి ఉందనే విషయాన్ని ఈడీ ప్రస్తావించింది. కవిత విచారణకు హాజరు కాలేదని పేర్కొంది. మరో అయిదు రోజుల పాటు పిళ్లై కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా...మూడు రోజులు పొడిగించేందుకు కోర్టు అనుమతించింది. ఇటు కవిత సుప్రీంకోర్టు గతంలో మహిళల విచారణకు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాల అమలు గురించి ప్రశ్నిస్తున్నారు. తొలి సారి విచారణకు హాజరైన సమయంలో రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగించిన అంశాన్ని కవిత తరపు ప్రతినిధులు ప్రశ్నించారు













Click it and Unblock the Notifications