హైదరాబాద్ to ఆదియోగి టూర్.. తక్కువ బడ్జెట్ లో.. ఎలా వెళ్లాలి..?
కార్తీకమాసం మహాశివుడికి విశేషమైనదిగా చెబుతారు. ఈ సమయంలో పరమశివుని 'ఆదియోగి' విగ్రహాన్ని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ మహా ఆదియోగి విగ్రహం తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు ఏకంగా 112 అడుగులుగా ఉండటం విశేషం. ఆదియోగి విగ్రహ రూపం ఎంతో ఆకర్షణీయంగా.. కన్నుల విందుగా ఉంటుంది. ఈ ఆదియోగి విగ్రహాన్ని వారంలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకునే వీలుంది. ఇక రాత్రి సమయాల్లో ఇక్కడ లైటింగ్ షో ఏర్పాటు చేస్తారు. వివిధ లైట్ల కలర్స్ మధ్య ఆదియోగి విగ్రహం చూపు తిప్పుకోనివ్వకుండా ఉంటుంది. ఈ విగ్రహాన్ని ఉచితంగానే దర్శించుకోవచ్చు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వాహన పార్కింగ్ కు మాత్రం రూ. 50 చెల్లించాలి.
మరి హైదరాబాద్ నుంచి ఆదియోగి దర్శనానికి ఎలా వెళ్లాలి..? సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ప్రతి రోజూ కోయంబత్తూర్ కు రైలు సదుపాయం ఉంది. కోయంబత్తూర్ చేరుకున్నాక.. అక్కడి నుంచి ఆదియోగి విగ్రహం సుమారు 30 కిలోమీటర్లు ఉంది. కోయంబత్తూర్ లోని గాంధీపురం బస్ట్ స్టేషన్ నుంచి ప్రతి గంటకు ఆదియోగి విగ్రహం వద్దకు ఓ బస్సు అందుబాటులో ఉంటుంది. లేదా సొంత వాహనంలోనూ వెళ్లొచ్చు. లేదా క్యాబ్, ఆటో బుకింగ్ చేసుకుని ఆదియోగి విగ్రహం వద్దకు చేరుకోవచ్చు. ఇక విమానంలో చేరుకోవాలి అనుకునేవారు ముందుగా కోయంబత్తూరు విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఆదియోగి విగ్రహం వద్దకు చేరుకోవచ్చు.
చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఆదియోగి విగ్రహం ఆకట్టుకుంటుంది. శివరాత్రి సమయంలో ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి జాగరణ చేస్తుంటారు. ఈ విగ్రహం 112 అడుగుల పొడవు 147 అడుగుల వెడల్పుతో ముగ్ధమనోహరంగా ఉంటుంది.

ఆదియోగిని దర్శించుకున్నాక ఇక్కడికి సమీపంలోనే ధ్యానలింగం, నాగ గుడి, త్రిమురి ప్యానెల్, నంది విగ్రహం, లింగ భైరవి ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడే సూర్యకుండ్, చంద్రకుండ్ ఉన్నాయి. దర్శనానికి ముందు భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications