రాకేష్ కుటుంబానికి రూ. 25 లక్షల చెక్కు, సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం: ఆ ఊరికి ఎర్రబెల్లి వరం
వరంగల్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లలో చనిపోయిన రాకేశ్ కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం పరామర్శించారు. వరంగల్ జిల్లా ఖానాపురం డబీర్పేటలో రాకేశ్ చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం రాకేష్ తండ్రి కుమారస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల చెక్కు అందజేశారు.
అంతేగాక, రాకేశ్ సోదరుడు రామరాజుకు నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం ఇస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. రామరాజుకు నియామక పత్రం మంత్రి చేతులమీదుగా అందజేశారు. రాకేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. మనం పంజాబ్ రైతుల కోసం డబ్బులు ఇచ్చినట్లు తెలిపారు.

దేశం కోసం చనిపోయిన యువకుడి కుటుంబాన్ని కేంద్రం ఆదుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. దయచేసి ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. సీఎం కేసీఆర్లాగా కేంద్రం కూడా సాయం చేయాలని, ఆయా పార్టీల తరఫున రాకేశ్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దేశ సేవ చేయాలనే సంకల్పంతో ఉన్న యువకుడి మరణం తీరని లోటని మంత్రి అన్నారు.
రాకేశ్ ఆత్మ శాంతించాలంటే కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామన్నారు. ఈ ఊరిని దత్తత తీసుకుంటానని ఎర్రబెల్లి చెప్పారు. సీసీ రోడ్ల కోసం రూ.50 లక్షలు ప్రకటిస్న్నట్లు మంత్రి తెలిపారు.