వరంగల్లో మాదే గెలుపు: బిజెపికి ఎర్రబెల్లి మెలిక, కేంద్రమంత్రిపై పిఎస్లో ఫిర్యాదు
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమిదే విజయం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం చెప్పారు. అయితే, టిడిపి అభ్యర్థి పోటీ చేస్తేనే విజయావకాశాలు ఎక్కువ అని బిజెపికి మెలిక పెట్టారు.
రైతు సమస్యసు పట్టించుకోండి: ఉత్తమ్
సాగర్ ఎడమ కాలువ ద్వారా అయిదువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం డిమాండ్ చేశారు. రైతు సమస్యలు పట్టించుకోకుండా ప్రభుత్వం బతుకమ్మ సంబరాలు నిర్వహించడం విడ్డూరమన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరు బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి 400 ఇళ్లు ఏం సరిపోతాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు కేటాయింపు బాధ్యత ఇవ్వడం వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందన్నారు.
కెసిఆర్కు రిఫరెండం: తమ్మినేని
వరంగల్ ఉప ఎన్నికలు కెసిఆర్ పాలనకు రిఫరెండం అని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. నాగార్జున సాగర్లో సిపిఎం ప్లీనరి సందర్భంగా తమ్మినేని మాట్లాడారు. కెసిఆర్ పాలన పైన ప్రజల్లో అసంతృప్తి నెలకొని ఉందన్నారు. కెసిఆర్ నియంతృత్వ ధోరణికి కళ్లెం వేస్తామన్నారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు.
సిపిఎం నేత బీవి రాఘవులు మాట్లాడుతూ.. కెసిఆర్, చంద్రబాబు రాష్ట్రాలను వదిలి దేశాలు తిరుగుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్, చంద్రబాబులకు ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందన్నారు. రైతులు తీసుకున్న అప్పులను కూడా ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ధర్నా చౌక్ అవసరం లేదని, కానీ ఇప్పుడు అక్కడ ఖాళీయే ఉండటం లేదని ఎద్దేవా చేశారు.
కేంద్రమంత్రి పైన గాలి వినోద్ కుమార్ ఫిర్యాదు
కేంద్రమంత్రి వికె సింగ్ పైన వామపక్షాల వరంగల్ ఉప ఎన్నికల అభ్యర్థి గాలి వినోద్ కుమార్ వరంగల్ జిల్లా మట్వాడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఆయన దళితులను కించపర్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.