కాంగ్రెస్ నేతలతో ఈటల రాజేందర్ ఫొటో: పార్టీ మార్పుపై క్లారిటీ
కాంగ్రెస్ పార్టీ నేతలతో బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఫొటోలు వైరల్ కావడం చర్చనీయాశంగా మారింది. ఈ క్రమంలో ఆయన స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ స్పష్టత ఇచ్చారు. బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహా రెడ్డి గృహ ప్రవేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిశానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొందరు తప్పుడు వార్తలను సృష్టించారని మండిపడ్డారు.
తాను కాంగ్రెస్లో చేరనున్నారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు ఈటల రాజేందర్. కాగా, ఎన్నికల ముందు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావు, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఈటల దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈటల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది.

పార్టీ మారతారనే వస్తున్న వార్తలను ఈటల రాజేందర్ ఖండించారు. బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహా రెడ్డి గృహ ప్రవేశంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడిన ఫొటోలను వైరల్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఉన్నానని ఈటల రాజేందర్ తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. ఈ ఫొటోలపై దుష్ప్రచారం సరికాదని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications