కేసీఆర్! చిత్తశుద్ధి ఉంటే అలా చేయండి: హరీశ్ అన్నట్లుగా కాదంటూ ఈటల రాజేందర్ సవాల్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు హుజూరాబాద్ ప్రజల కంటే వారి ఓట్లమీదనే ప్రేమ ఎక్కువ అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అనారోగ్యం నుంచి కోలుకుని జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మెరుగైన వైద్యం అందించిన అపోలో యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్న కేసీఆర్..
రాష్ట్రంలో ఉద్యమకారులంతా కనుమరుగవుతున్నారని.. తెలంగాణ ద్రోహులంతా తెరపైకి వస్తున్నారని ఈటల రాజేంరద్ అన్నారు. మానుకోటలో ఓదార్పు యాత్ర సమయంలో ఉద్యమకారులపై రాళ్లదాడి చేసిన వ్యక్తికి ప్రాధాన్యం కల్పించారని మండిపడ్డారు. రాళ్లదాడి చేసిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించారని, ఈ విషయంపై తనతో కలిసి పనిచేసిన ప్రతి ఉద్యమకారులు ఆలోచించాలని కోరారు. ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పట్టం కడుతున్నారని విమర్శించారు.

హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు..
గత ఎన్నికల్లోనూ తనను ఓడించేందుకు ప్రయత్నించారని ఈటల రాజేందర్ ఆరోపించారు. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచేందుకు సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలను నమ్ముకున్నారని ఆరోపించారు. ఒక్కో నాయకుడికి ఖరీదు కట్టి కొనుగోళ్ల పర్వానికి తెరలేపారని రాజేందర్ ఆరోపించారు.
ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ. 150 కోట్లను నగదు రూపంలో ఖర్చు చేశారన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికతోనే కేసీఆర్కు హామీలు గుర్తొచ్చాయని, అందుకే తాయిలాలు ప్రకటిస్తున్నారని ఈటల మండిపడ్డారు. నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడేళ్లలో ఏనాడూ అంబేద్కర్కు కేసీఆర్ పూలదండవేయలేదన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్.. ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఆ తర్వాత తొలగించారని అన్నారు.

వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలంటూ ఈటల రాజేందర్
దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు దాన్ని వర్తింపజేయాలన్నారు. ఆర్థికంగా వెనకబడిన వాళ్లను కూడా ఆదుకోవాలని ఈ మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చలేదన్నారు.

హరీశ్ రావు అన్నట్లుగా తాను కాదంటూ ఈటల రాజేందర్
హుజూరాబాద్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఈటల వ్యాఖ్యానించారు. తాను డ్రామాలు ఆడేవాడిని కాదని, సీరియస్ రాజకీయ నాయకుడినని అన్నారు. డ్రామాలు ఆడుతున్నానంటూ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. వైద్యలు సూచన మేరకు రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు.
కాగా, దళిత బంధు పథకం హుజూరాబాద్ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రకటించారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈటలకు సన్నిహితులైన పలువురు నేతలు కూడా ఇటీవల టీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామంటూ ప్రకటించారు. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేతలను కేసీఆర్ కొంటున్నారని ఈటల ఆరోపిస్తున్నారు. భూ కబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్కు ఉపఎన్నిక జరగనుంది.












Click it and Unblock the Notifications