అసెంబ్లీలో రాజేందర్ ముఖం కనిపించద్దన్న సీఎం - రాజీ పడేది లేదు : ఈటల..!!
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహారంలో కొత్త చర్చ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున స్పీకర్ వ్యవహరించిన తీరు పైన ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. దీని పైన మంత్రులు రాజేందర్ కు హెచ్చరికలు చేసారు. స్పీకర్ పైన రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరాలని డిమాండ్ చేసారు. లేకుంటా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు రాజేందర్ పైన స్పీకర్ చర్యలకు సిద్దం అవుతున్నారనే వాదన వినిపిస్తోంది. స్పీకర్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అదే సమయంలో సభ నుంచి ఈటలను సస్పెండ్ చేస్తారనే ప్రచారమూ వినిపిస్తోంది. దీని పైన ఈటల రాజేందర్ స్పందించారు.స్పీకర్ నాకు తండ్రి లాంటి వారని చెప్పుకొచ్చారు. స్పీకర్ ను అధికార పార్టీ నేతలే అగౌరవ పరుస్తున్నారని విమర్వించారు. ధర్మంగా ఉండే స్పీకర్ ను అడ్డంగా పెట్టుకొని మీరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని.. టీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. బెదిరింపులకు భయపడమని రాజేందర్ తేల్చి చెప్పారు. చావు కైనా సిద్దపడతానని.. రాజీ పడేది లేదని స్పష్టం చేసారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత శాసనసభ మర్యాదలను తుంగలో తొక్కారంటూ ధ్వజమెత్తారు.

బీఏసీ లో అన్ని రూల్స్ ప్రకారమే ఉండవు... కొన్ని సంప్రదాయం ప్రకారం నడుస్తాయని చెప్పుకొచ్చారు. తమను బీఏసీని పిలవాల్సి ఉన్నా పిలవలేదన్నారు. తాము స్పీకర్ ను అడిగామని చెప్పుకొచ్చారు. తాను నలుగురు స్పీకర్ లు.. నలుగురు ముఖ్యమంత్రులు దగ్గర పని చేసానని చెప్పిన ఈటల... ఎవరు తనను ఏమీ అనలేదని వివరించారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన స్పందించారు. తాను ఎవరినీ అవమానించేలా ఇప్పటి వరకు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన మొఖం అసెంబ్లీలో చూడొద్దని అనుకున్నారట అంటూ రాజేందర్ పేర్కొన్నారు. దీంతో..ఇప్పుడు ఈటల రాజేందర్ స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఎటు వైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications