30 తర్వాత జరిగేది అదే: టీఆర్ఎస్కు ఈటల రాజేందర్ హెచ్చరిక, ఫాంహౌస్ ముట్టడి, బీజేపీకే ఓటు
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్ది నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని స్పష్టం చేశారు.
అక్టోబర్ 30 తర్వాత ప్రతీకారమే..: ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఈటల రాజేందర్ మాట్లాడారు. తాము కళ్లు తెరిస్తే మాడి మసైపోతారని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్నందున తామేమీ మాట్లాడటం లేదని, అక్టోబర్ 30 తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారో దానిపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ఈటల రాజేందర్.
దళితబంధు సహా పథకాలు తెచ్చేతానేనంటూ ఈటల రాజేందర్
హుజూరాబాద్ నియోజకవర్గానికి దళితబంధు, పెన్షన్లు సహా ఇతర పథకాలు రావడానికి తానే కారణమని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. నాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేయలేదని, తెచ్చిన పార్టీని గెలిపించారన్నారు. ఇప్పుడు కూడా పథకాలు ఇస్తోంది కేసీఆర్ అయినా.. తెచ్చింది మాత్రం తానేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో కమలం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని ఈటల రాజేందర్ కోరారు.
కేసీఆర్ ఫాంహౌస్ను వదిలిపెట్టమన్న రఘునందన్ రావు
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారంలోఎన్నికల ప్రచారం నిర్వహించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు..ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు చుక్కలు చూపిస్తామన్నారు. హుజురాబాద్లో ఆత్మాభిమానానికి అహంకారానికి మధ్య పోటీ అన్నారు. కడుపు నిండా అన్నం పెట్టేవాడు ఈటల రాజేందర్ అని అన్నారు. కేసీఆర్ చిటికెన వేలు అయితే.. మోడీ బొటన వేలు లాంటివాడన్నారు. పండించినా ప్రతీ గింజా కొనాలని... లేదంటే బండెనక బండి కట్టి కేసీఆర్ ఫామ్ హౌస్లో పోసి కొనే వరకు వదిలిపెట్టబోమన్నారు. ఆగం చేద్దాం కానీ ఆగం కావొద్దన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ఎన్ని ఇచ్చినా తీసుకుని.. ఓటు మాత్రం ఈటలకు వేయాలన్నారు. బాత్రూమ్ కడితే రూ. 9 వేలు కేంద్రం ఇస్తుందని.. సీసీ రోడ్డుకి లక్ష రూపాయలు అయితే 90 వేలు ఇస్తుందని అన్నారు. కానీ, తాను ఇస్తున్నట్టుగా కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని రఘునందన్ రావు విమర్శించారు.
Recommended Video
ఈటలపై అభిమానం పోలింగ్ భూత్లో చూపాలన్న వివేక్ వెంకటస్వామి
వీణవంక మండలం గంగారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ ప్రజల మంచి కోసమే ఆలోచిస్తాడని అన్నారు. ఈటల రాజేందర్ రాజీనామా వల్లే హుజురాబాద్ కు ఇన్ని పథకాలు వచ్చాయన్నారు. నాగార్జునసాగర్, హుజూర్నగర్ లో ఇచ్చిన హామీలే ఇంకా నెరవేర్చలేదన్నారు. కానీ, హుజురాబాద్ లో హామీలను కేసీఆర్ మెడలు వంచి ఈటల అమలు చేయిస్తారన్నారు. కేంద్రం రెండు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తే కట్టలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఇచ్చే అవినీతి డబ్బులు తీసుకుని.. ఈటల రాజేందర్ కు ఓటేయాలన్నారు. ఈటలపై ప్రేమను పోలింగ్ బూత్లో చూపించాలని వివేక్ వెంకట స్వామి హుజూరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం జోరు పెంచాయి.