దేశానికే అవమానం: కేంద్రంపై ఈటల రాజేందర్ ఫైర్, తెలంగాణలో లాక్డౌన్పై క్లారిటీ
హైదరాబాద్: కరోనా ఉధృతి సమయంలో బీజేపీ నేతలు బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

19 జిల్లాల్లో
తెలంగాణలో నాలుగు రాష్ట్రాలకు చెందిన రోగులకు చికిత్స జరుగుతోందని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూస్తున్నామన్నారు. శుక్రవారం నుంచి 19 జిల్లా డయాగ్నోస్టిక్స్ హబ్లు ప్రారంభమవుతాయన్నారు మంత్రి ఈటల. హోంఐసోలేషన్లో ఉన్నవారికి జిల్లా డయాగ్నోస్టిక్స్ రక్త పరీక్షలు నిర్వహిస్తాయి. హోం ఐసోలేషన్లో ఉన్నవారు 3, 4 రోజులకోకాసరి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోవడం దేశానికే అవమానం..
కరోనా సమయంలో ఆక్సిజన్ లేక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. అవసరమైన ఆక్సిజన్ను కేంద్రం యుద్ధప్రాతికన సరఫరా చేయాలని కోరారు. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని కోరితే.. 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించిందని మంత్రి తెలిపారు. రాష్ట్రానికి దగ్గర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

తెలంగాణలో లాక్డౌన్ ఆలోచన లేదు..
వ్యాక్సిన్ ఉత్పత్తి యుద్ధప్రాతికన పెరగాలని మంత్రి ఈటల అన్నారు. వ్యాక్సిన్ లేకపోతే గందరగోళమవుతుందని అధికారులు చెబుతున్నారని అన్నారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలని, రెండు కంపెనీల ఉత్పత్తి 6 కోట్లేనని అంటున్నారని, వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రణాళికను ప్రకటించాలన్నారు. అంతేగాక, ఉచితంగా టీకా ఇవ్వాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. తెలంగాణలో మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితి లేదని మంత్రి ఈటల అన్నారు.

తెలంగాణకు 3 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు
కాగా, తెలంగాణకు 3 లక్షల కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ వ్యాక్సిన్ను కోఠిలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారి వివరాల ఆధారంగా ఆయా జిల్లాలకు టీకాలు పంపినీ చేయనున్నారు.












Click it and Unblock the Notifications