నిధులేవీ?, గొప్పేమీ లేదు: బడ్జెట్పై ఈటెల, కవిత పెదవి విరుపు, ఆరోగ్య బీమాపై వినోద్
న్యూఢిల్లీ/హైదరాబాద్: అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్పై తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ప్రజల ముద్ర లేదని ఈటెల అభిప్రాయపడ్డారు. గురువారం హైదరాబాద్లో మాట్లాడారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని అన్నారు. సుమారు రూ. 40 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని తాము అడిగామని, కానీ ఇచ్చిందేమీ లేదని ఆయన అన్నారు. దేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే కదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రగతిశీల నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్న రాష్ట్రాలకు సాయం అందించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని అన్నారు. అప్పుడే మిగతా రాష్ట్రాలు ప్రగతీపథంలో సాగుతున్న రాష్ట్రాలను చూసి స్ఫూర్తి పొందుతాయని పేర్కొన్నారు.
గొప్పగా ఏమీ లేదు..
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో కనీస మద్దతు ధర పెంపు ప్రకటన లేకపోవడం బాధాకరమని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేంద్ర బడ్జెట్పై కవిత స్పందిస్తూ.. కనీస మద్దతు ధరలను 50 శాతం పెంచుతామని ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చిందన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరలను 50 శాతం పెంచి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కోరారు.
గ్రామీణ ప్రజల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు లేవన్నారు. విద్య ఆరోగ్యంపై దృష్టి పెట్టామని చెప్పినా వాటికి సైతం కేటాయింపులు పెద్దగా లేవని చెప్పారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వ వైఖరి విచిత్రంగా ఉందని వెల్లడించారు. పెద్ద కంపెనీలను వదిలి మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై పన్నులు వేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల పక్షాన ఉండి ఉంటే బాగుండేదని ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టింది ఎన్నికల బడ్జెట్ అన్నారు. గ్రామీణ ప్రజల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు లేవని చెప్పారు.
మహిళా శిశుసంకేమానికి సంబంధించి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఢిల్లీలో కూర్చొని గ్రామాల్లో పనిచేస్తోన్న ఉపాధి హామీ కూలీలకు అకౌంట్లో డబ్బులు వేస్తామనడం సరైంది కాదు. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు సీరియస్గా తీసుకోవాలి. రాష్ట్రాలపై కేంద్ర పెత్తనం సరైంది కాదన్నారు.
రాష్ట్రాలకు చెప్పకుండానే ఆరోగ్య బీమా పథకం: 40శాతం నిధులపై వినోద్
మోడీ కేర్ గా చెప్పుకుంటున్న ఆరోగ్య బీమా పథకంలో 50కోట్ల మంది కుటుంబాలకు మేలు జరుగుతుందని మోడీ ప్రభుత్వం చెబుతోందని, ఇది మంచి పథకమని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అయితే, ఇందులో మోడీ ప్రభుత్వం ఓ విషయాన్ని దాచిపెట్టిందన్నారు. ఈ పథకం అమలుకు కేంద్రం 60శాతం నిధులు కేటాయిస్తే.. రాష్ట్రాలు 40శాతం వరకు నిధులు కేటాయించాలని తెలిపారు. ఈ విషయాన్ని బడ్జెట్ తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పారని తెలిపారు. అయితే, ఈ విషయాన్ని రాష్ట్రాలను సంప్రదించకుండానే పథకం ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రాల పరిస్థితులను పట్టించుకోకుండా, వాటిని సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని అన్నారు. లక్ష కోట్ల వరకు అవసరమయ్యే ఈ పథకానికి కేవలం రూ.2వేల కోట్లే కేటాయించడం జరిగిందని అన్నారు.