టీఆర్ఎస్ నుంచీ ఈటల బహిష్కరణ! -రాజేందర్ బీసీ ముసుగులో ఓసీ -వైఎస్సార్తో డీల్ -గంగుల, కొప్పుల సంచలనం
భూకబ్జా ఆరోపణలపై మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్కు మరో భారీ ఎదురుదెబ్బ కాచుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనను బహిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఈటల రాజీనామా ప్రకటించాక వేటేస్తారా, అంతకుముందే పార్టీ నుంచి వెళ్లగొడతారా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. బర్తరఫ్ తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతోన్న రాజేందర్.. సీఎం కేసీఆర్ పై ప్రతివిమర్శలు చేయడమేకాకుండా టీఆర్ఎస్ సర్కారుపై హైకోర్టులో న్యాయపోరాటానికి దిగడంతో ఆయపై గులాబీ దళం విరుచుకుపడింది. తెలంగాణ భవన్ వేదికగా ఉమ్మడి కరీంనగర్ నేతలంతా ఏకమై ఈటల గుట్టువిప్పారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్, సీనియర్ నేత నారదాసు లక్షణ్ సాక్షిగా మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లు ఈటలపై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు..
ఈటల రాజేందర్ సంచలనం -కేసీఆర్ సర్కారుపై హైకోర్టులో ఫైట్ -ఎన్నారైల మద్దతు -కరపత్రాల కలకలం
బీసీ ముసుగులోని ఓసీ..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక మేక వన్నె పులి, బీసీ బలహీన వర్గాల ముసుగులో ఉన్న ఓసీ పెద్ద దొర అని, హుజురాబాద్కు వెళ్తే బీసీగా, హైదరాబాద్లో ఉంటే ఓసీగా వ్యవహరిస్తారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కేసీఆర్ స్థాపించిన పార్టీలో ఆలస్యంగా చేరి, కేసీఆర్ బొమ్మతో ఆరుసార్లు గెలిచిన ఈటల, పెద్దాయన దయతోనే మంత్రి అయ్యారని, అలాంటిది ఇవాళ కేసీఆర్ నే దూషించే స్థాయికి దిగజారారని మంత్రి మండిపడ్డారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నానని చెప్పిన ఈటల.. ఇంత తక్కువ సమయంలో వేల ఎకరాల భూములు, వేల కోట్ల ఆస్తులు, మెడికల్ కాలేజీ ఎలా సంపాదించాలో చెప్పాలని గంగుల డిమాండ్ చేశారు.
వైఎస్సార్తో ఏం మాట్లాడావ్?
దేవరయాంజల్ భూకుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన ఈటల రాజేందర్ తన తప్పుల్ని కప్పిపుచ్చుకోడానికి అడ్డగోలు వాదన చేస్తున్నాడని మంత్రి కమలాకర్ ఫైరయ్యారు. ''ఆనాడు అసెంబ్లీలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడానని ఈటెల చెబుతున్నాడు. కేవలం దేవరయాంజల్ భూముల కోసమే కదా ఆయన డీల్స్ చేసుకున్నది. అంతేగానీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈటల ఏనాడైనా మాట్లాడాడా? ముదిరాజ్లకు చేప పిల్లలు ఇవ్వాలని ఎప్పుడైనా కేసీఆర్ను రాజేందర్ కోరడా? ఇవాళ పదవి పోగానే ఈటలకు ముదిరాజ్లు గుర్తుకొస్తున్నారా? 2018 ఎన్నికల్లో బీసీ నాయకుడిని ఓడగొట్టే ప్రయత్నం చేశాడు ఈటల. కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు పరిగె అంటూ హేళన చేశాడు. పార్టీలో తిరుగుబాటుకు యత్నించినా, ఆయన గౌరవానికి భంగం కలగొద్దనే ఇప్పటిదాకా ఉపేక్షించాం. ఇకపై ఊరుకోబోము. హుజురాబాద్ వెళ్లిమరి ఈటలను నిలువరిస్తాం..'' అని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.
మంత్రులకు అవమానం అబద్ధం
టీఆర్ఎస్ సర్కారుపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఇష్టారీతిగా మాట్లాడటం సరికాదని, టీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని, మంత్రులను సీఎం కేసీఆర్ మనుషులుగా కూడా చూడరని ఈటల చెప్పడం సత్యదూరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈటల చేరకముందే ఉద్యమం ఉధృతంగా ఉందని, టీఆర్ఎస్ పార్టీ 2001లో పుడితే, ఈటల 2003లోగానీ పార్టీలో చేరారని, కేసీఆర్ అన్ని విధాలా రాజేందర్ కు గౌరవమిచ్చి పార్టీలో, ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చారని కొప్పుల గుర్తుచేశారు. అసలు ఈటలకు ఏం తక్కువై ఈరకంగా వ్యవహరిస్తున్నాడో అర్థంకావడంలేదని మంత్రి వాపోయారు..
భూఅక్రమాలను ఈటలే ఒప్పుకున్నాడు
''పేదలు, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను కొనొద్దని ఈటలకు తెలియదా? 66 ఎకరాల అసైన్డ్ భూమిని కొన్నానని రాజేందర్ స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నాడు. వ్యాపార విస్తరణ కోసమే ఆ పనిచేశానని చెప్పాడు. ఈటలకు తన వ్యాపారమే ముఖ్యం తప్ప బీసీలు, ఎస్సీల స్థితిగతులు అసలే పట్టవు. ఎకరం కోటిన్నర పలికే భూమిని రూ. 6 లక్షలకే కొనుగోలు చేశాడు. దేవరయాంజల్లో దేవాలయ భూములను చెరపట్టారు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా, ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా అనేక రకాలుగా లబ్దిపొందిన ఈటల ఇవాళ సీఎంపైనే దాడి చేస్తుంటూ మేం చూస్తూ ఊరుకోబోము'' అని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఇదిలా ఉంటే..
Recommended Video
ఈటలకు బీజేపీ నేతల మద్దతు..
భూకబ్జా ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ ఓవైపు టీఆర్ఎస్ సర్కారుపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెంచారు. మంగళవారం తెలంగాణ భవన్ లో చోటుచేసుకున్న పరిణామాలను బట్టి టీఆర్ఎస్ నుంచి కూడా ఈటలపై బహిష్కరణ వేటు తప్పదని నిర్ధారణ కావడంతో, తదుపరి అడుగులపై ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎన్నారైలతో, వివిధ వర్గాలతో కాన్ఫరెన్సులు, మీటింగ్స్ జరుపుతున్నారు. పార్టీ వేటేయడానికి ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమా, సొంత పార్టీ పెట్టడమా లేక మరో నిర్ణయమా అనేది ఈటల ప్రకటించనున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజేందర్ పట్ల సీఎ కేసీఆర్, టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని, రాజేందర్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అండగా ఉంటాయని బీజేపీ నాయకుడు లల్లూ ముదిరాజ్ అన్నారు. మిగతా మంత్రుల భూభాగోతాలపైనా విచారణలు జరిపించాలని లల్లూ డిమాండ్ చేశారు.