అత్యాచారాల విశ్వనగరం.. కేసీఆర్ కు ఒక్కక్షణం కూడా సీఎంగా ఉండే అర్హతలేదు: ఈటల రాజేందర్
ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించలేని కేసీఆర్ కు ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత లేదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపై స్పందించిన ఈటల రాజేందర్ విశ్వ నగరం అని చెప్పుకునే హైదరాబాదులో దేశంలోనే ఎక్కడా లేనన్ని సీసీ కెమెరాలు పెట్టి , ప్రతి ఏరియాను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వాచ్ చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే పోలీస్ వ్యవస్థ ఉన్న చోట ఇలాంటి అత్యాచారాలు జరగడం బాధాకరమని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ లో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై స్పందించిన ఈటల
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గొప్ప సర్వైలెన్స్ వ్యవస్థ దేశంలోనే మరెక్కడా లేదని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని కానీ గత కొద్ది రోజులుగా జరుగుతున్న అత్యాచారాలు, అత్యాచారాలలో పాల్గొంటున్న మైనర్ పిల్లలను చూస్తున్నామని పేర్కొన్నారు. పదుల సంఖ్యలో ఘటనలు మన నోటీసుకు వస్తున్నాయని, అయితే ఇటువంటి ఘటనలు వందల సంఖ్యలో జరుగుతున్నట్టుగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాదు ప్రాధాన్యతను, తెలంగాణ గొప్పతనాన్ని ఇటువంటి ఘటనలు మంటగలుపుతున్నాయి అయి అని ఆవేదన వ్యక్తం చేశారు.

అర్దరాత్రి బయటకు వెళ్లి సేఫ్ గా వస్తామన్న భరోసా లేదు
అమ్మాయిలు, మహిళలపై వేధింపులు తగ్గిస్తామని షీ టీమ్ లు పెట్టారని, కానీ పబ్ లలో, నిర్మానుష్య ప్రాంతాలలో, చివరికి కార్లలో తీసుకువెళ్లి లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు తగ్గిపోతున్నాయి అని చెప్పడానికి ఇటువంటి ఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి అని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో అర్థరాత్రి సమయంలో బయటకు వెళ్లి సేఫ్ గా తిరిగి ఇంటికి వస్తామన్న భరోసా లేకుండా పోయిందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

అత్యాచార ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
కెసిఆర్ పరిపాలనలో ప్రజల ప్రాణాలకు, ప్రజల మానాలకు, ప్రజల ఆస్తులకు భరోసా లేదని మండిపడ్డారు. మన రాష్ట్రంలో జరుగుతున్న లైంగిక దాడులపై చర్యలు శూన్యం గా కనిపిస్తున్నాయని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇటీవల జరిగిన లైంగిక వేధింపులలో మైనర్లు కూడా ఉన్నారని, అధికార పార్టీకి చెందిన నాయకుల పిల్లలు కూడా ఉన్నారని పేర్కొన్న ఈటల రాజేందర్, ఈ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలకు విశ్వాసం పోయిందని, సీఎం వెంటనే గద్దె దిగిపోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications