కేసీఆర్.. అసెంబ్లీలో తప్పించుకున్నా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు: హెచ్చరించిన ఈటల రాజేందర్
ప్రజా సమస్యలపై చర్చించవలసిన శాసనసభ తొలి రోజు కేవలం ఐదు నిమిషాలు సాగిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. అసెంబ్లీలో తప్పించుకోవచ్చు కానీ ప్రజల చేతిలో టిఆర్ఎస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని పేర్కొన్నారు ఈటల రాజేందర్.

బీఏసీ సమావేశానికి బిజెపి ఎమ్మెల్యేలను పిలవకపోవడంపై ఈటల ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం మొక్కుబడిగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో బీఏసీ ని సంప్రదించకుండా మూడు రోజులకే పరిమితం చేశారని, ఇది కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఇక బీఏసీ సమావేశానికి బిజెపి ఎమ్మెల్యేలను పిలవకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

శాసనసభ్యులను గడ్డిపోచలా అవమానిస్తున్నారు
శాసనసభ్యులను గడ్డిపోచలాగా అవమానిస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ప్రశ్నించిన తమను బడ్జెట్ సమావేశాల నుండి అకారణంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి అంటే తమ సమస్యలను ప్రస్తావించాలని అనేక రంగాల వారు విన్నవించుకునే పరిస్థితి ఉండేదని, ఉమ్మడి ఏపీలో 80 రోజుల నుంచి 90 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగేవని, ఇక బడ్జెట్ సమావేశాలు 40 రోజుల నుండి 50 రోజులపాటు జరిగేవని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

స్పీకర్ మరమనిషిలా సీఎం చెప్పిందే చేస్తున్నారు
గత సమావేశాల్లో బిజెపి ఎమ్మెల్యేలను అకారణంగా అన్యాయంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను సైతం టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. స్పీకర్ మర మనిషిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీఎం చెప్పింది తప్ప స్పీకర్ వేరే పని చేయడం లేదని, గతంలో ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బిఏసి సమావేశానికి పిలిచేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, ఇది సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చరిత్రలోనే ఇంత తక్కువ అసెంబ్లీ సమావేశాలు జరగలేదు
తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సీఎం కేసీఆర్ పాలన పై సంతోషంగా లేరని పేర్కొన్న ఈటల వీఆర్ఏ, గ్రామ కార్యదర్శులు, గెస్ట్ లెక్చరర్ లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇక ఆయా వర్గాల నుండి తమకు అనేక విజ్ఞాపనలు వస్తున్నాయని వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడూ ఇంత తక్కువ సమావేశాలు జరగలేదని ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు.

అవకాశమిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాం .. లేదంటే ప్రజాక్షేత్రంలో పోరాడతాం
తమ సమస్యలను సభలో ప్రస్తావించాలని వీఆర్ఏలు, వీఆర్వోలు, గిరిజనులు కోరుతున్నారని, సమయానికి జీతాలు రావడం లేదని ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని, వారి సమస్యలపై అసెంబ్లీలో అవకాశమిస్తే ప్రజా సమస్యలపై గళం వినిపిస్తామని, లేదంటే ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు ఈటల రాజేందర్.












Click it and Unblock the Notifications