నిజామాబాద్లో ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం
హైదరాబాదు: నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు ఎక్కువమంది నిలవడంతో ఓటింగ్ ఎలా నిర్వహిస్తారనే మీమాంస చాలామందిలో నెలకొంది. అంత మంది అభ్యర్థులకు ఈవీఎంలలో చోటు దక్కదనే వాదన విపిపించింది. అయితే వీటన్నిటికీ ఫుల్స్టాప్ చెబుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఈవీఎంలతోనే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది ఈమేరకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఎం3 ఈవీఎంల ద్వారా ఎక్కువ మంది అభ్యర్థులకు పోలింగ్ జరిపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఈవీఎంలనే ఉపయోగించి పోలింగ్ జరపాలని నిర్ణయించింది.
నిజామాబాద్ బరిలో ప్రస్తుతం 185 మంది అభ్యర్థుల ఉండగా నోటాతో కలిపి ఆ సంఖ్య 186కి చేరనుంది. దీనికోసం 12 బ్యాలెట్ యూనిట్లు అవసరం కానున్నట్లు ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఆ మేరకు ఎం3 ఈవీఎంలను సరఫరా చేయాలని ఈసీఐఎల్ సంస్థకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2600 వీవీ ప్యాట్ యంత్రాలు అందించాలని ఈసీఐఎల్కు సూచించింది.
ఇదిలా ఉంటే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవిత, కాంగ్రెస్ల మధ్యే జరగనుంది. అయితే రైతులు మాత్రం ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్ దాఖలు చేయడంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే దీని వెనక ఏదో వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.