అక్కాచెల్లెళ్ల హత్య: అమిత్ సింగ్ అరెస్ట్, మేడ్చల్లో పట్టుకున్నామని నాయిని
హైదరాబాద్: భాగ్యనగరంలోని చైతన్యపురిలో జరిగిన అక్కాచెల్లెళ్ల జంట హత్యల కేసులో నిందితుడు అమిత్ సింగ్ను నగర ఎస్వోటీ పోలీసులు మంగళవారం నాడు ఉదయం అరెస్టు చేశారు.
ప్రేమోన్మాది అమిత్ సింగ్ గుజరాత్ రాష్ట్రంలో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అయితే, మంగళవారం ఎట్టకేలకు అతడిని అరెస్టు చేశారు. ఈ నెల 14వ తేదీన అక్కాచెల్లెళ్ల పైన అమిత్ సింగ్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. యువతుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అమిత్ సింగ్ కోసం మూడు పోలీసు బృందాలు గాలించాయి. గత పదిహేను రోజులుగా అతన్ని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. శ్రీలేఖను, ఆమె అక్క యామినీ సరస్వతిని హత్య చేసిన తర్వాత అమిత్ సింగ్ ఎల్బీ నగర్ ప్రాంతంలో సంచరించినట్లు గుర్తించారు.
అతని చివరి ఫోన్ లోకేషన్ ఎల్బీ నగర్లోనమోదైంది. హత్య చేసిన అమిత్ సింగ్ పారిపోయిన వెంటనే పోలీసులు అమిత్ సింగ్ చదివాడని చెబుతున్న నారాయణగూడా, ఇబ్రహీంపట్నం కాలేజీలకు వెళ్లి స్నేహితుల వద్ద ఆరా తీశారు.
అయితే, అతను ఆ కాలేజీల్లో చదవడం లేదని పోలీసులు తేల్చుకున్నారు. ఆ తర్వాత స్వస్థలం షాద్ నగర్ వెళ్లారు. అమిత్ సింగ్ కుటుంబ సభ్యుల ఇంటికి తాళం వేసి ఉంది. కుటుంబ సభ్యులను పట్టుకోవడంలో పోలీసులు మునిగిపోయిన సమయంలో అమిత్ సింగ్ జులై 14వ తేదీన నేరుగా సికింద్రాబాద్ వెళ్లి ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించారని సమాచారం. ఆ తర్వాత గుజరాత్ వెళ్లాడని తెలుస్తోంది.
మేడ్చల్లో అరెస్ట్ చేశాం: నాయిని నర్సింహా రెడ్డి
అక్కాచెల్లెళ్ల హత్య కేసులో నిందితుడు అమిత్ సింగ్ను మేడ్చల్లో అరెస్టు చేసినట్లు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం చెప్పారు. కుటుంబ సభ్యుల సహకారంతో అరెస్టు చేశామన్నారు. నాయిని అక్కాచెల్లెళ్ల కుటుంబాన్ని పరామర్శించారు.