మాజీ నక్సలైట్ దారుణ హత్య.. యూట్యూబ్ ఇంటర్వ్యూ వల్లే !!
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులో జరిగిన మాజీ మావోయిస్టు బల్లెపు నర్సయ్య అలియాస్ సిద్ధన్న హత్య కేసు పెద్ద సంచలనం సృష్టించింది. గతంలో నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి... దశాబ్దాల తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో పాత ఘటన మళ్లీ వెలుగులోకి రావడంతో జరిగిన ఈ హత్య సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ హత్య వెనుక కారణం ఇటీవల యూట్యూబ్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ అని పోలీసులు తేల్చారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
యూట్యూబ్ ఇంటర్వ్యూ వల్లే..
కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధన్న తన మావోయిస్టు కాలంలో జరిగిన కొన్ని కీలక సంఘటనలను వెల్లడించారు. ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని తానే హత్య చేశానని చెప్పడం పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ వీడియోను చనిపోయిన వ్యక్తి కొడుకు సంతోష్ చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన తండ్రిని చంపిన వ్యక్తి ఇప్పుడు సామాన్య జీవితంలో గౌరవంగా తిరుగుతున్నాడన్న భావనతో ఆగ్రహం పెరిగి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే సంతోష్ సిద్ధన్నను చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అందులో భాగంగానే సిద్ధన్నను సంప్రదించి, అభిమానిని అంటూ నమ్మకం సంపాదించుకున్నాడు. తరచూ మాట్లాడడం, కలవడం, వ్యక్తిగత అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా సిద్ధన్నను పూర్తి స్థాయిలో నమ్మించాడు. తరువాత అనుకూలమైన సమయం చూసి అగ్రహారం గుట్టలకు తీసుకెళ్లాడు. అక్కడ అకస్మాత్తుగా దాడి చేసి రాళ్లతో కొట్టి అతన్ని హతమార్చాడు. హత్య చేసిన వెంటనే సంతోష్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఈ లొంగిపోయిన సమయంలోనే అసలు విషయం బయటపెట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు./
ఉద్యమం నుంచి సాధారణ జీవితం వైపు..
సిద్ధన్న గతంలో పీపుల్స్ వార్ పార్టీ (ఇప్పటి మావోయిస్టు)లో దశాబ్దం పాటు పనిచేసి, అనేక ఆపరేషన్లలో పాల్గొన్నారు. కోవర్టు హత్యాకాండల్లోనూ, పలు ఎన్కౌంటర్ ఘటనల్లోనూ అతని పాత్ర ఉన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. 2004లో ఆయన స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయి, ప్రభుత్వ పునరావాస పథకాలతో సాధారణ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం గండిలచ్చపేటలో నివసిస్తున్న ఆయనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇక సిద్ధన్న హత్య వార్త విన్న వెంటనే ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై వేములవాడకు చేరుకున్నారు. గ్రామ ప్రజలు సైతం సిద్ధన్న హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో నక్సలైట్ అయినా, తర్వాత మంచి వ్యక్తిత్వంతో అందరితో కలిసిమెలిసి ఉండేవాడని అంటున్నారు. మరోవైపు ఈ హత్య ఘటనలో సంతోష్ ఒక్కరే ఉన్నారా అన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు ముందు సిద్ధన్న ఫోన్ కాల్ వివరాలు, వారి ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్, CCTV ఫుటేజ్ వంటి అంశాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమకాలంలో జరిగిన ఒక ఘటన... అప్పటి పరిస్థితుల్లో తీసుకున్న ఒక నిర్ణయం... దశాబ్దాల తర్వాత ఇప్పుడు మళ్లీ అతని ప్రాణం పోగొట్టుకోవడానికి కారణమైందని వాపోతున్నారు.












Click it and Unblock the Notifications