మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మృతి-నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు కుమారుల మరణం
ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్రనాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో ఆయన మృతి చెందినట్లు సమాచారం.
మాగంటి రవీంద్ర కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యారని తెలుస్తోంది. తాగుడు అలవాటు మానిపించడానికి కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించినట్లు సమాచారం. అయితే ఆస్పత్రి నుంచి తప్పించుకుని వెళ్లిన రవీంద్ర కొద్దిరోజులుగా ఓ ప్రముఖ హోటల్లో ఉంటున్నట్లు తెలుస్తోంది.
హోటల్ గదిలో మంగళవారం(జూన్ 1) రవీంద్ర రక్తపు వాంతులు చేసుకోగా... అక్కడి సిబ్బంది ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించినట్లు సమాచారం. రవీంద్ర మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మాగంటి రవీంద్ర మృతిపై మరో వాదన కూడా వినిపిస్తోంది. హోటల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న రవీంద్రను కుటుంబ సభ్యులే యశోదా ఆస్పత్రికి తరలించినట్లుగా చెబుతున్నారు. అప్పటికే రవీంద్ర మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించినట్లు చెబుతున్నారు.
Recommended Video
మాగంటి బాబు పెద్ద కుమారుడు మాగంటి రాంజీ గత నెల 8వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి తేరుకోకముందే మాజీ ఎంపీ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు కుమారులను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.