నారా లోకేష్కు పరాభవం: కొడుకు కన్నా తండ్రే నయమట!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి ) ఎన్నికల ప్రచారాన్ని భుజాన మోసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్కు ఓ సర్వే అనూహ్యమైన షాక్ ఇచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్లను అత్యధికంగా ప్రభావితం చేసిన నేతలు ఎవరనే విషయంపై వీడీపీ అసోసియేట్స్ సంస్థ సర్వే నిర్వహించి ఫలితాలు వెల్లడించింది. అత్యంత ప్రభావశీల నాయకుడిగా తెలంగాణ మంత్రి కెటి రామారావు తేలినట్లు సర్వే వెల్లడించింది. కెటిఆర్ 29 శాతం మంది తెరాసకు ఓటేలా ప్రభావితం చేశారని తెలిపింది.
రెండో స్థానంలో మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు, మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ నిలిచారు. ఆయనకు 22 శాతం మంది అండగా నిలిచారు. మూడో స్థానం మాత్రం చంద్రబాబు నాయుడికి దక్కింది. 11 శాతంతో ఆయనకు ఈ స్థానం దక్కింది.
తాను హైదరాబాదీని, తాను హైదరాబాదులో పుట్టానని, తనకు హైదరాబాద్పై హక్కు ఉందని ఎన్నికల ప్రచార సభలో చెబుతూ కెటిఆర్కు సవాళ్లు విసిరిన నారా లోకేష్కు మూడు శాతం మంది మాత్రమే ఓటేశారు. తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండేసి శాతం మాత్రమే దక్కించుకున్నారు.