పైకి బడాయి, లోపల ఆందోళన: ఎవరి లెక్కలు వారివే, షాక్ ఎవరికో?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ మంగళవారం ముగిసింది. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్ ఫలితాలు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, మేయర్ సీటును కైవసం చేసుకుంటుందని చెబుతున్నాయి. అయితే, టిడిపి, బిజెపి, కాంగ్రెస్, మజ్లిస్ నేతలు కూడా ఆశించిన సీట్లు దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తమ పార్టీ మేజిక్ ఫిగర్ చేరుకుంటుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు చెప్పారు. టిడిపి ముప్పై స్థానాలు, తమ మిత్ర పక్షం బిజెపి 10 స్థానాల వరకు గెలుచుకుంటుందని తెలంగాణ టిడిపి చీఫ్ ఎల్ రమణ అంటున్నారు.
టిడిపి 30 స్థానాలకు పైగా గెలుస్తుందని, తద్వారా హైదరాబాద్లో, తెలంగాణలో తమ బలం తగ్గలేదని నిరూపించుకుంటామని రమణ చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్, టిఆర్ఎస్ నేతలు పదేపదే తెలంగాణలో టిడిపికి చోటు లేదని చెబుతున్నారని, ఆ వ్యాఖ్యలు అబద్దమవుతాయని ఎల్ రమణ అన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, టిడిపి నేత మాగంటి గోపినాథ్ కూడా తమ పార్టీ 30 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం తమకు కలిసి వచ్చిందని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు అంటున్నారు.
బిజెపి 25 స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తాము 30కి పైగా స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, సర్వే ఫలితాల్లో తమ పార్టీకి సింగిల్ డిజిట్ వస్తుందని తేలడం వల్ల కాంగ్రెస్ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నారా లోకేష్, కెటిఆర్ల మధ్య మాటల యుద్ధం కూడా నడిచిన విషయం తెలిసిందే.