వివాహేతర బంధం: విమానంలో వచ్చి ప్రియురాలి భర్త హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే..
హైదరాబాద్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యలు తరచూ చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. తాజాగా నగరంలో మరో హత్య చోటు చేసుకుంది. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని తన ప్రియుడితో కట్టుకున్న భర్తను చంపించింది ఓ కిరాతకురాలు.
మొదట అనుమానాస్పద మృతిగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తమ విచారణలో భార్య, ఆమె ప్రియుడే హత్య చేశారని తేల్చారు. వెంటనే మృతుడి భార్యను అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
8ఏళ్ల క్రితం వివాహం
ఘటనకు సంబంధించి డీసీపీ సాయిశేఖర్, ఏసీపీ గోవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు జై మంగళదాస్(32) బతుకుదెరువు కోసం ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్కి వలస వచ్చాడు. భార్య మాలతీదేవి, ముగ్గురు కుమారులతో ఫతేనగర్లోని పైప్లైన్ రోడ్డులో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ప్రియుడితో చనువుగా
ఏడాదికోసారి జై మంగళదాస్ కుటుంబంతో కలిసి బీహార్కు వెళ్లి వస్తుంటాడు. ఏడాది క్రితం బీహార్ వెళ్లినప్పుడు నీరజ్కుమార్(మాలతీదేవి చెల్లెలి మరిది)తో చనువు ఏర్పడింది. కాగా, వీరు చనువుగా ఉండటంపై మంగళదాస్ భార్యను పలుమార్లు మందలించాడు. అయినా మాలతీదేవి నీరజ్తో నిత్యం సెల్ఫోన్లో మాట్లాడేది.
విమానంలో వచ్చి ప్రియురాలి భర్త హత్య
ఈ క్రమంలో జనవరి 31న ఇద్దరు ఫోన్లోనే మంగళదాస్ హత్యకు పథకం పన్నారు. దీనిలో భాగంగా నీరజ్కుమార్ బీహార్ నుంచి స్పైస్జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు మాలతి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే మద్యం సేవించి నిద్ర మత్తులో ఉన్న మంగళదాస్ మెడకు నీరజ్ తాడు బిగించి హత్య చేశాడు. మంగళదాస్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు సూసైడ్ నోట్ రాసిన నీరజ్.. మాలతికి రూ.12,000 ఇచ్చి రాత్రి 2.30 గంటల సమయంలో బయల్దేరి తిరిగి విమానంలోనే వెళ్లిపోయాడు.
తండ్రిని లేపేందుకు కొడుకు..
మరికొంతసేపటికి మాలతీ కూడా ఇద్దరు పిల్లలతో పారిపోయింది. ఇంట్లోనే ఉన్న మరో కుమారుడు ఫిబ్రవరి 1న స్కూల్కు వెళ్లేందుకు తండ్రిని నిద్ర లేపే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో మంగళదాస్ కంపెనీలో పనిచేసే ప్రదీప్, చిత్తరంజన్ ప్రధాన్ అక్కడికి వచ్చారు. అతను చనిపోయినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
విచారణలో తేలిన అసలు నిజం
కాగా, మొదట ఆత్మహత్యగానే భావించిన పోలీసులు.. ఒంటిపై ఉన్న గాయాలను చూసి అనుమానాస్పదస్థితిగా కేసు నమో దు చేశారు. అంతేగాక, పోస్టుమార్టం నివేదికలో తాడు లాంటి వస్తువుతో గొంతు నులి మి చంపినట్లుగా తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాలతీదేవి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని బస్టాండ్లో ఉన్న మాలతీదేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వివరాలు వెల్లడించింది. ఆమె నుంచి రూ.4 వేల నగదుతో పాటు సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రియుడు నీరజ్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందం బీహార్ వెళ్లింది.