చాటింగ్తో వల.. 5లక్షలు గుంజాడు: యువతి ఫిర్యాదుతో అరెస్టు
హైదరాబాద్ : సోషల్ మీడియా మోసాలు పెరిగిపోతున్నాయి. చాటింగ్ లతో యువతులకు దగ్గరవడం.. ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకోవడం లాంటి ఘటనలు ఈమధ్య కాలంలో విపరీతంగా పెరిగాయి.
తాజాగా సికింద్రాబాద్ లోని చిలకలగూడలో ఇలాంటి ఉదంతమే బయటపడింది. చిలకలగూడలో నివాసముంటూ బిటెక్ చదువుతోన్న ఆకాశ్ రెడ్డి అనే యువకుడు.. ఫేస్ బుక్ ద్వారా ఓ యువతికి గాలమేశాడు. అమాయకంగా అతన్ని నమ్మిన యువతి అతనితో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. అలా కొన్ని రోజులు ఇద్దరి మధ్య ఫేస్ బుక్ ఫ్రెండ్ షిప్ నడిచాక.. ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు ఆకాశ్.
ఇందుకోసం ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. దీంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో అతగాడికి రూ.5లక్షలు సమర్పించుకుంది యువతి. అక్కడితో అతగాడి వేధింపులకు ఫుల్ స్టాప్ పడుతుందని భావించిన యువతికి ఆ తర్వాత మళ్లీ వేధింపులు మొదలవడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో దిక్కు తోచని స్థితిలో పోలీసులను ఆశ్రయించి తన గోడు వెల్లబోసుకుంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆకాశ్ రెడ్డిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.