అమ్మాయిలను వేధించేవాళ్లుగా, నగరంలో నకిలీ బిచ్చగాళ్లు: మేయర్
హైదరాబాద్: భాగ్యనగరంలో నకిలీ బిచ్చగాళ్లు లేకుండా చేస్తామని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. హైదరాబాదును విశ్వనగరంగా మార్చడానికి తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా నకిలీ బిచ్చగాళ్లు ఉంటే ఏరివేస్తామన్నారు.
ఆయన ఈ రోజు (బుధవారం నాడు) యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన 'బిచ్చగాళ్లు లేని హైదరాబాద్' కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధానిని బిచ్చగాళ్లు లేని నగరంగా చేస్తామని చెప్పారు.
కొన్ని నెలలుగా హైదరాబాద్లో జరిపిన సర్వేలో పదివేల మందికి పైగా బిచ్చగాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీళ్లలో కొద్దిమంది మాత్రమే అసలైన బిచ్చగాళ్లని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. నగరంలో బిచ్చమెత్తుకునే వాళ్లపై పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుందన్నారు.
బిచ్చగాళ్ల రూపంలో డ్రగ్స్ అమ్మేవారు, అమ్మాయిలను వేధించేవాళ్లు ఉన్నారని చెప్పారు. బిచ్చమెత్తుకోవడం కోసం పసిపిల్లలకు నార్కోటిక్స్ లాంటి మత్తుమందులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో అసలైన బిచ్చగాళ్లను గుర్తించి వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. నకిలీ బిచ్చగాళ్లను వారి స్వస్థలాలకు పంపిస్తామన్నారు.