ఐఏఎస్ అధికారినంటూ ఎంపీ, ఎమ్మల్యేలకు టోకరా: అరెస్ట్
హైదరాబాద్: ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ అల్వాల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దపురానికి చెందిన రాఘవేందర్ రెడ్డి ఐఏఎస్ అధికారిగా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లి, ఐఏఎస్ అధికారినంటూ రాఘవేంద్రరెడ్డి తనకు తాను పరిచయం చేసుకునే వాడు. అనంతరం వారితో పరిచయాలు పెంచుకుని... వారి పేర్లు ఉపయోగించుకునే వాడు.
ఈ క్రమంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, పేదవారికి పట్టాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి.. నిరుద్యోగులు, పేదల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము దండుకుని అక్కడనుంచి పరారయ్యేవాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో నిందితుడు రాఘవేంద్రరెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. అతడి బారిన పడిన వారిలో జంటనగరాలకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఉన్నారని సమాచారం.
కాగా, మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే కనకారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు రాఘవేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వద్ద నుంచి రూ. 90వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.