మూడో వ్యక్తి: బీటెక్ విద్యార్థిని దేవిని లైంగికంగా వేధించి చంపేశారా? (పిక్చర్స్)
హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థిని దేవి అనుమానాస్పద మృతి అంశం ఎన్నో మలుపులు తిరుగుతోంది. తమ కుమార్తె ప్రమాదవశాత్తూ మరణించలేదని, ఆమెను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని దేవీ తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు.
దీంతో, పోలీసులు తిరిగి మొదటి నుంచి దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన కారును ఘటనా స్థలంలోకి తిరిగి తెప్పించి, పోలీసులతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు, మోటారు వాహనాల అధికారులు పరిశీలించారు. జూబ్లిహీల్స్లో ఆదివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో దేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
గురువారం ఘటనా స్థలంలో పోలీసులు విచారణ జరుపుతుండగా.. దేవి బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. నిష్పక్షపాతంగా దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన రోజున కారులో మరో ఇద్దరు ఉన్నారని, వారిని తప్పించారని ఆరోపించారు.
ప్రమాదం జరిగిన రోజున కారు ముందు భాగం చాలా తక్కువగా దెబ్బతిందని, కానీ ఇప్పుడు పోలీసులు తీసుకు వచ్చేసరికి ఎక్కువ డ్యామేజీ అయిందని దేవి సోదరి మానస అన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఆధారంతో చూపించారు. పోలీసులు కావాలనే దోషులను తప్పిస్తున్నారని ఆరోపించారు.
దేవి మృతి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దేవి కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఆదివారం తెల్లవారుజామున జర్నలిస్టుకాలనీలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వాస్తవాలను వెలికితీసేందుకు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు.
దేవి మృతి
ప్రమాదానికి కారణమైన భరత్సింహా రెడ్డిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు ఆయన నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. విచారణలో భరత్సింహా రెడ్డి వెల్లడించిన వివరాల్లో ఏ మేరకు వాస్తవం ఉందనే అంశంపై సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.
దేవి మృతి
ఈ క్రమంలోనే గురువారం వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు, బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలంలో క్రైం రీకన్స్ట్రక్షన్ సీన్ను చేపట్టారు.
దేవి మృతి
ప్రమాదానికి ముందు కారు ఎటువైపు నుంచి వచ్చింది. ఎంతవేగంతో చెట్టును ఢీకొట్టింది అనే అంశాలను అంచనా వేసేందుకు ప్రమాదానికి గురైన కారును తీసుకువచ్చారు.
దేవి మృతి
దేవి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన ఉస్మానియా దవాఖాన వైద్యుడు లక్ష్మణ్ ప్రమాద తీవ్రతను అంచనా వేశారు. దేవి మృతికి కారణమైన గాయాలను పరిశీలించారు.
దేవి మృతి
ఈ సమయంలో పోలీసులను దేవి కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఈ కేసులో నిష్పాక్షికంగా విచారణ జరగడం లేదని ఆరోపించారు. సంఘటన జరిగిన రోజున హడావిడిగా కారును తొలగించిన పోలీసులు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దేవి మృతి
ప్రమాదం జరిగిన కారులో దేవి, భరతసింహా రెడ్డితో పాటు మూడో వ్యక్తి కూడా ఉన్నారని అతనెవరో తేల్చి, దేవిరెడ్డి మృతికి కారకులైన వారిని అరెస్టు చేయాలని ఆమె బంధువులు డిమాండ్ చేశారు.
దేవి మృతి
కాగా, లైంగికంగా వేధించి చంపారంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్పినా.. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయలేదన్నారు. కారులో భరతసింగా రెడ్డితో పాటు మరొకరున్నారని బడాబాబులను కాపాడేందుకే పోలీసులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
దేవి మృతి
అయితే ఈ ప్రమాదం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు లోతైన విచారణ చేస్తున్నామని, పలు అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డీసీపీ తెలిపారు.
దేవి మృతి
ఇప్పటికే ఘటనపై సాంకేతికపరమైన సాక్ష్యాలను సేకరించామని, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయన్నారు.
దేవి మృతి
ఒకవేళ ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఏవైనా ఉంటే అందించాలని పోలీసులు సూచించారు. అందుకు అంగీకరించిన కుటుంబసభ్యులు, బంధువులు దర్యాప్తుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
దేవి మృతి
దేవి మృతి కేసు దర్యాప్తు బాధ్యతలను బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్ కుమార్ రెడ్డికి అప్పగిస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దేవి మృతిలో నిందితులను కాపాడేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.