రైతు పొలంలో బంగారం లంకె బిందెలు లభ్యం: అమ్మవారు కలలో వచ్చి..
జనగామ: జిల్లాలోని పెంబర్తి గ్రామంలో గురువారం ఓ రైతు పొలంలో బంగారం బిందె లభ్యమైంది. రెవెన్యూ, పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నర్సింహ పెంబర్తి గ్రామ పరిధిలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

ఆ భూమిలో వెంచర్ ఏర్పాటు కోసం జేసీబీతో భూమిని చదును చేస్తుండగా లంకె బిందే కనిపించింది. వెంటనే భూమి యజమాని నర్సింహ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి బిందెను తెరిచి చూడగా అందులో 17 తులాలకుపైగా బంగారం, 10 కిలోల వెండి ఆభరణాలు లభ్యమైంది.

ఈ విషయంపై భూమి యజమాని నర్సింహ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా తనకు కలలో అమ్మవారు కనిపిస్తోందని తెలిపాడు. ఈ క్రమంలోనే తన భూమిలో అమ్మవారి గుడి కట్టించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తహసీల్దార్ రవీందర్, గ్రామ సంర్పంచ్ ఆంజనేయులు, పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
కాగా, అధికారులు లంకెబిందెలను స్వాధీనం చేసుకున్నారు. పురవాస్తు శాఖ అధికారులు స్పందించి మరింత తవ్వకాలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. లభించిన బంగారం ఏ కాలం నాటిదో పురావస్తు అధికారులు తేలుస్తారని పోలీసులు తెలిపారు. కాగా, లంకెబిందెలు దొరకడంతో ఆ సొమ్ముతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.